అసెంబ్లీ నియోజకవర్గాలపై బీజేపీ హైకమాండ్ దృష్టి

అసెంబ్లీ నియోజకవర్గాలపై బీజేపీ హైకమాండ్ దృష్టి
  • యూపీ సీఎం యోగి, మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్.. కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజుకు బాధ్యతలు
  • ఈ నెల 30 నుంచి వచ్చే నెల 2 వరకు నియోజకవర్గాల్లో లీడర్ల పర్యటన
  • అక్కడ పార్టీ పరిస్థితి, కేంద్ర పథకాల అమలుపై సమీక్షలు 
  • వచ్చే నెల 1న హైదరాబాద్​కు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలపై బీజేపీ హైకమాండ్ దృష్టి పెట్టింది. పార్టీ బలోపేతమే లక్ష్యంగా జాతీయ నేతలను రంగంలోకి దించింది. ఇతర రాష్ట్రాల నేతలను నియోజకవర్గాల ఇన్ చార్జులుగా నియమించింది. ఇప్పటికే లిస్టు రెడీ చేసిన కేంద్ర నాయకత్వం.. దాన్ని రాష్ట్ర పార్టీకి పంపించింది. ఈ జాబితాలో కేంద్ర మంత్రులు, సీఎంలు, డిప్యూటీ సీఎంలు, మాజీ సీఎంలు, పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు ఉన్నారు. కొన్ని కీలకమైన నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రులు, సీఎంలు, మాజీ సీఎంలకు బాధ్యతలు అప్పగించారు. ఆయా నియోజకవర్గాల్లో వీరి కింద మరో నేత కూడా ఉంటారు. అయితే సెక్యూరిటీ కారణాల వల్ల ఎవరికి? ఏ నియోజకవర్గం? కేటాయించారనే విషయాలను రాష్ట్ర నేతలు వెల్లడించడం లేదు. ఈ లిస్టులో కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు. కీలక నేతలు ఈ నెల 30 నుంచి వచ్చే నెల 2 వరకు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మిగతా నాయకులు ఈ నెల 28 నుంచే పర్యటనలు చేయనున్నారు. వీరందరూ అక్కడే బస చేయడంతో పాటు కార్యకర్తల ఇండ్లలోనే భోజనాలు చేయనున్నారు. వీరు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, కేంద్ర పథకాల అమలు, ప్రధాని మోడీ సభకు జన సమీకరణపై సమీక్ష చేస్తారు. నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య సమన్వయం, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి అనేది తెలుసుకుంటారు. సమస్యలపై పోరాటానికి స్థానిక నేతలకు సూచనలు ఇస్తారు. 2న పర్యటన ముగించుకొని బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరవుతారు. 

అసెంబ్లీ ఎన్నికల వరకు వీళ్లే... 
రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, వాటికి ఇప్పటికే కోఆర్డినేటర్లను రాష్ట్ర పార్టీ నియమించింది. మోడీ సభకు జన సమీకరణ కోసమే వీరిని నియమించారు. వీళ్లతో సమన్వయం చేసుకుంటూ జాతీయ నేతలు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. తమ నియోజవర్గానికి ఏ జాతీయ నాయకుడు వస్తారనేది ఇప్పటికే ఆయా కోఆర్డినేటర్లకు పార్టీ  సమాచారం ఇచ్చిందని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. జాతీయ నేతలు తర్వాత కూడా తరచూ నియోజకవర్గాల్లో పర్యటిస్తారని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకూ నియోజకవర్గ నేతలకు, ప్రజలకు అందుబాటులో ఉంటారని పేర్కొంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయంలో వీరి నిర్ణయమే కీలకం కానుందని చెబుతున్నారు. అయితే ఇతర రాష్ట్రాల నేతలను ఇన్ చార్జులుగా నియమిస్తూ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం ఏ మేరకు వర్కవుట్ అవుతుందనే చర్చ కూడా రాష్ట్ర పార్టీలో జరుగుతోంది. 

నడ్డాకు 50 వేల మందితో స్వాగతం 
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఒక రోజు ముందే ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా హైదరాబాద్​కు రానున్నారు. 1న సిటీకి రానున్న ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్​పోర్టు నుంచి 50 వేల మందితో ర్యాలీ తీయాలని ప్లాన్ చేస్తున్నారు. కాగా 1, 2 తేదీల్లో ఇతర రాష్ట్రాల బీజేపీ సీఎంలు హైదరాబాద్ లో నివాసముంటున్న తమ రాష్ట్రాల ప్రజలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవడానికి మద్దతు ఇవ్వాలని వాళ్లను కోరనున్నారు. ఇందుకోసం కూడా రాష్ట్ర పార్టీ ఏర్పాట్లు చేస్తోంది.