మతం పేరుతో బీజేపీ చిచ్చు పెడుతోంది : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు 

మతం పేరుతో బీజేపీ చిచ్చు పెడుతోంది : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు 

జగిత్యాల టౌన్, వెలుగు : అన్నదమ్ముళ్లా కలిసి ఉంటున్న దేశ ప్రజల్లో మతం పేరుతో బీజేపీ ప్రభుత్వం చిచ్చుపెడుతోందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. శుక్రవారం జగిత్యాల జిల్లా సీపీఐ 4వ మహాసభలు జిల్లా కార్యదర్శి వెన్న సురేశ్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షతన జరిగింది. అంతకుముందు పట్టణంలో డప్పు చప్పుళ్లతో పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డితో కలిసి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. సీపీఐ జెండా ఎగరేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కమ్యూనిస్టులు బలపడితేనే దేశం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. దేశ సంపద అంబానీ, అదానీ, టాటా బిర్లా వంటి పెట్టుబడిదారుల గుత్తాధిపత్యంలోకి వెళ్లిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దళారుల కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. చాడ వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ ఎర్ర జెండాతోనే అంగన్వాడీలు, ఆశాలు, ఇతర ఉద్యోగుల హక్కులు సాధించుకున్నారన్నారు. సీపీఐతోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు.