కామారెడ్డిలో బీజేపీ గెలుపు ఖాయం: కిషన్​రెడ్డి

కామారెడ్డిలో బీజేపీ గెలుపు ఖాయం: కిషన్​రెడ్డి

కామారెడ్డి, కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డిలో బీజేపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఆయన ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. పొందూర్తి చౌరస్తా నుంచి జిల్లా కేంద్రంలోని రాజిరెడ్డి గార్డెన్​ వరకు  భారీ బైక్ ​ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తల మీటింగ్​లో కిషన్​రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్​కు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదన్నారు. ఆయన ఇక్కడ  కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి గెలవాలనుకుంటున్నారన్నారు. కానీ కామారెడ్డి ప్రజలు అమ్ముడుపోయే వాళ్లు కాదని, పులిబిడ్డలన్నారు. ఇక్కడి కార్యకర్తలు, ప్రజల ఉత్సాహం చూస్తుంటే బీజేపీ గెలుపు ఖాయమనిపిస్తుందన్నారు.

కాటిపల్లి వెంకటరమణారెడ్డి గెలుపు కోసం నెలరోజులు కష్టపడాలని, ఆ తర్వాత ఆయన మీ కోసం ఐదేండ్లు కష్టపడుతారన్నారు. బీజేపీ ప్రభుత్వం వస్తే వెంకటరమణారెడ్డికి మంత్రి పదవి ఇస్తామన్నారు. అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలే తన బలమన్నారు. లీడర్లు మురళీధర్​గౌడ్, నీలం చిన్నరాజులు,   జిల్లా జనరల్ సెక్రెటరీ తేలు శ్రీనివాస్, వైస్​ ప్రెసిడెంట్​ వెంకట్​రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్​ లక్ష్మారెడ్డి, ఫ్లోర్​లీడర్ ​శ్రీకాంత్, టౌన్​ప్రెసిడెంట్​విఫుల్, కౌన్సిలర్లు, ఆయా మండలాల ప్రెసిడెంట్లు, గ్రామ  శాఖ ప్రెసిడెంట్లు, కార్యకర్తలు, బూత్​కన్వీనర్లు పాల్గొన్నారు.