కాంగ్రెస్, బీఆర్ఎస్​కు ఓటేసుడు వేస్ట్ : బూర నర్సయ్య గౌడ్

కాంగ్రెస్, బీఆర్ఎస్​కు ఓటేసుడు వేస్ట్ : బూర నర్సయ్య గౌడ్

హైదరాబాద్, వెలుగు: ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నాయని, ఇరు పార్టీల నేతలు పోటీ పడి ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారని బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఫైర్ అయ్యారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఓటు వేస్తే వృథాయేనన్నారు. బీఆర్ఎస్ గల్లీలో లేదు.. ఢిల్లీలో లేదని, కాంగ్రెస్ కు 50 సీట్లకు మించి వచ్చే పరిస్థితి లేదని, ఇప్పటికే ఇండి కూటమి కూలిపోతున్నదని విమర్శించారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని 17కు17 ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకుంటే.. తెలంగాణలో ఉన్న అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. మోదీ సర్కారు రూ.13 వేల కోట్ల బడ్జెట్ తో విశ్వకర్మ యోజన స్కీంను ప్రవేశపెట్టారని, అసెంబ్లీ ఎన్నికల వల్ల రాష్ట్రంలో అది అమలు కావడంలో జాప్యం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు1.20 లక్షల మందిని విశ్వకర్మ యోజనలో చేర్పించామని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను వెరిఫికేషన్ చేస్తే లబ్ధిదారులకు నిధులు అందుతాయని, ఇప్పటికే దానికి సంబంధించిన గ్రాంట్ కూడా బ్యాంకుల్లో డిపాజిట్ అయిందని బూర నర్సయ్య వివరించారు.

దీనిపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు కూడా ఆయన చెప్పారు. ఇప్పటి వరకు  4 వేల మందికి సంబంధించిన దరఖాస్తులను కూడా వెరిఫై చేయలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తే మళ్లీ ఎంపీ ఎన్నికల కోడ్ వచ్చే చాన్స్​ఉందని, దీనిపై సీఎం వెంటనే స్పందించాలని కోరారు. ‘‘లంకె బిందెలు ఖాళీ అయి పెంక కుండలు ఉన్నాయని రేవంత్ అంటున్నారు కదా.. ఈ వెరిఫికేషన్లు పూర్తి చేస్తే... తెలంగాణకు కేంద్రం లంకె బిందెలు ఈ రూపంలో ఇచ్చేందుకు రెడీగా ఉంది”అని ఆయన పేర్కొన్నారు.