అభివృద్ధి కోసమని పార్టీ మారి చేసిందేముంది

అభివృద్ధి కోసమని పార్టీ మారి చేసిందేముంది

ఎల్ బి నగర్ నియోజకవర్గంలో ముంపు ప్రాంత ప్రజల సమస్యలు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పట్టించుకోవడంలేదని రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షులు సామ రంగారెడ్డి విమర్శించారు. రెండు మూడు రోజులుగా నగరంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్ బి నగర్ నియోజకవర్గంలో రెడ్డి కాలనీని సామ రంగారెడ్డి సందర్శించారు. ఈ క్రమంలో ఆయన కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.

అనంతరం సామ రంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎల్ బి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వాట్సాప్ లో మెస్సేజ్ లు పెడుతు వర్షాల పట్ల  జాగ్రత్తలు చెప్పడం విడ్డురంగా ఉందన్నారు. రెండేళ్ల క్రితం వర్షాలకు నియోజకవర్గ లోని ముంపు ప్రాంతాలైన ఎల్ బి నగర్ రెడ్డి కాలనీ, చంపాపేట, లింగోజి గూడ, గడ్డిన్నారం డివిజన్ లలో ఇండ్లలోకి నీళ్లు చేరి సర్వసం  కోల్పోయిన పరిస్థితి ఉందని తెలిపారు. ఈ సమస్య పరిష్కారించడంలో ఎమ్మెల్యే, అధికార యంత్రాంగం పూర్తి గా విఫలమైందని పేర్కొన్నారు. 

డివిజన్ లలో డ్రైనేజి వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉంది. ట్రంక్ లైన్స్, బాక్స్ డ్రైన్ నాలా పనుల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించక అసంపూర్తిగా నిలిచిపోయిన దుస్థితికి ఎమ్మెల్యే నిర్లక్ష్యమే కారణమని సామ రంగా రెడ్డి ఆరోపించారు. అభివృద్ధి కోసం పార్టీ మారుతున్న అని చెప్పుకున్న ఎమ్మెల్యే తనను అభివృద్ధి చేసుకొని ప్రజా సమస్యలు గాలికి వదిలేసాడని సామ రంగా రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.