పాలకుల తీరుతో జనం తల పట్టుకున్నారు

పాలకుల తీరుతో జనం తల పట్టుకున్నారు

కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యాల వల్ల ప్రజలు తలలు పట్టుకొని కూర్చున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. లాక్‌డౌన్ వల్ల ఎటువంటి ఉపయోగంలేదన్న కేసీఆర్‌కు.. గతంలో సరి, బేసి సంఖ్యలో దుకాణాలకు అనుమతులిచ్చిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. లాక్‌డౌన్ విధిస్తే ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతుందని సీఎం అనడం విడ్డూరంగా ఉందని ఆమె అన్నారు.

‘తెలంగాణలో కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అయోమయంలో ఉన్నట్టు స్పష్టమవుతోంది. కేవలం నైట్ కర్ఫ్యూ వల్ల ఫలితం లేదని తేలిపోయింది. పగటి పూట నియంత్రణలేమీ లేవు. మరోవైపు కొన్ని పెద్ద రాష్ట్రాలు పరిస్థితిని అదుపు చేసేందుకు స్పల్పకాల లాక్‌డౌన్ విధించాయి. మరి తెలంగాణ విషయానికి వచ్చే సరికి లాక్‌డౌన్ వల్ల ఉపాధి, వ్యాపారాలు దెబ్బతిని ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతుందని, ధాన్యం సేకరణ కూడా తీవ్రంగా గాడి తప్పుతుందని సీఎం కేసీఆర్ సెలవిచ్చారు. అయితే గతంలో సరి, బేసి సంఖ్యలో దుకాణాలు తెరవడానికి అవకాశమివ్వడం... కోవిడ్ నియంత్రణకు పరిమితుల మధ్య వాణిజ్య, పారిశ్రామిక, ఉద్యోగ, కార్మిక కార్యకలాపాలు నడిచేలా పాస్‌లు జారీ చేయడం వంటి చర్యలతో పరిస్థితిని కొంత అదుపు చేసిన సంగతి గుర్తు లేదా? ఇక రాష్ట్రంలో కరోనా చికిత్స తీరు, టెస్టుల నిర్వహణ, బెడ్లు, మందులు, వాక్సీన్ అందుబాటుపై దాదాపు రోజూ అధికారులకు కోర్టు మందలింపులు, మీడియా కథనాలు వాస్తవాల్ని చూపిస్తుంటే సీఎస్ గారు, సీఎం గారు మాత్రం అంతా బాగుందన్నట్టు ప్రకటనలు చేస్తున్నారు. ఒక రోజేమో అన్నీ సవ్యంగా ఉన్నాయని చెబుతారు... మరొక రోజు కేంద్రంపై నిందలేస్తూ విమర్శలు చేస్తారు. పరిస్థితిని కట్టడి చెయ్యలేని ఈ తెలంగాణ పాలకుల తీరుపై ఏం చెయ్యాలో తెలియక జనం తల పట్టుకుని కూర్చున్నారు’ అని విజయశాంతి ట్వీట్ చేశారు.