ఉపఎన్నిక తర్వాత కేసీఆర్ హామీలన్నీ మరచిపోతాడు

ఉపఎన్నిక తర్వాత కేసీఆర్ హామీలన్నీ మరచిపోతాడు

కరీంనగర్: ఈటల రాజేందర్ విజయం కోసం దళితులంతా కృషి చేయాలని బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్లుగా తన కుటుంబంలోని ఆరుగురికి అవకాశం ఇప్పించిన కేసీఆర్.. ఒక్క దళితుడికి కూడా ఇప్పించలేదని ఆయన మండిపడ్డారు. జమ్మికుంటలో జరుగుతున్న బీజేపీ ఎస్సీ మోర్చా సమావేశంలో పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

‘ఈటల రాజేందర్ విజయం కోసం దళితులంతా కృషి చేయాలి. కేసీఆర్ దళితుల ద్రోహి అని ఇప్పటికే అనేక మంది చెప్పారు. కేంద్రంలో మోడీ 12 మంది దళితులను కేబినెట్‎లోకి తీసుకున్నారు. బీజేపీ ప్రభుత్వం దళిత వ్యక్తిని రాష్ట్రపతిని చేసింది. కేసీఆర్ మాత్రం ఒకే దళిత వ్యక్తిని రాష్ట్ర  కేబినెట్‎లోకి తీసుకున్నారు. తన కుటుంబం నుంచి కొడుకు, అల్లుడు సహా ఆరుగురు బంధువులకు కేబినెట్ హోదా ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్లుగా తన కుటుంబంలోని ఆరుగురికి అవకాశం ఇప్పించిన కేసీఆర్.. ఒక్క దళితుడికి కూడా ఇప్పించలేదు. కేసీఆర్‎‎కు దళితులపై ఎక్కడ ప్రేమ ఉంది? దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మాట తప్పిన కేసీఆర్.. కనీసం తన తర్వాతైనా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పడం లేదు. కేసీఆర్ దళిత ద్రోహి. మూడెకరాలు ఇస్తానని కేసీఆర్ చెప్పినప్పుడు ఐదు లక్షలకు ఎకరా కొనిస్తానన్నాడు. 50 వేల కోట్లతో భూమి కొనిస్తానని అబద్ధాలు చెప్పాడు. దళితుల్లో ఎక్కువగా కౌలు రైతులే ఉంటారు. కానీ రైతుబంధు కౌలు రైతులకు  ఇవ్వడం లేదు. కాళేశ్వరం బ్యాక్ వాటర్‎లో పంట నష్టపోయిన రైతులతో మాట్లాడాను. వాళ్లంతా కౌలురైతులే. దళిత కౌలు రైతులకు ఎందుకు రైతుబంధు ఇవ్వరని ప్రశ్నించాను. కేసీఆర్ ఎప్పటికీ దళితులకు వ్యతిరేక కార్యక్రమాల గురించే ఆలోచిస్తారు. అప్పుడే మూడెకరాల భూమి ఇచ్చి ఉంటే వాటి విలువ 50 లక్షలు ఉండేది. డబుల్ బెడ్ రూం ఇస్తే దాని విలువ 15 లక్షలు ఉండేది. కానీ, ఈటలను ఓడించేందుకు, దళితులను మభ్యపెట్టేందుకు మరోసారి మోసం చేయడానికి దళితబంధు ప్రకటించారు. పదిలక్షలు డబ్బులు వేసినట్లే వేసి... అకౌంట్లు ఫ్రీజ్ చేశారు. మన ఓట్ల కోసమే కేసీఆర్ ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఈటల రాజేందర్‎ను గెలిపిస్తే.. సీఎం దిగివచ్చి దళితులందరికీ మూడెకరాల భూమి ఇస్తాడు. అబద్ధాల ముఖ్యమంత్రి  ఉప ఎన్నికల్లో మాయమాటలు చెప్పి.. ఎన్నికలయ్యాక మర్చిపోతాడు. ఇద్దరు దళిత ఉప ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ పక్కన పెట్టారు’ అని వివేక్ వెంకటస్వామి అన్నారు.