రాష్ట్ర ప్రభుత్వం రైతులను దోపిడీ చేస్తోంది: వివేక్ వెంకటస్వామి

రాష్ట్ర ప్రభుత్వం రైతులను దోపిడీ చేస్తోంది: వివేక్ వెంకటస్వామి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లతో కలిసి రైతులను దోపిడీ చేస్తోందని.. ఆఖరి గింజ వరకు కొంటామన్న ప్రభుత్వ హామీ నెరవేరడం లేదని ఆరోపించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. మే 10వ తేదీ బుధవారం ఆయన వరంగల్, జనగామా జిల్లాల్లో పర్యటించారు. ఇందులో భాగంగా వర్ధన్నపేట మండలం ఇల్లందులోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అకాల వర్షాలతో జరిగిన పంట నష్టం, కొనుగోలు కేంద్రాలలో ఎదుర్కొంటున్న  రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారాయన. అనంతరం జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వివేక్ వెంటస్వామి.. రాష్ట్రంలో పంటలు నష్టపోయి రైతులు ఏడుస్తుంటే ఆత్మీయ సమ్మేళనాల పేరుతో బీఆర్ఎస్ జల్సా చేస్తుందని విమర్శించారు.

ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద 5 నుంచి 7 కిలో వరకు తరుగు పేరుతో రైతులను దోపిడీ చేస్తున్నరని వివేక్ వెంటస్వామి ఆరోపించారు. రైతులకు రుణమాఫీ చేయలేదు.. ఎరువులు ఇవ్వలేదు..పంట నష్ట పరిహారం ఇవ్వడం లేదని మండిపడ్డారాయన. రాష్ట్రంలో ఫసల్ భీమా అమలు చేయకపోవడం వల్లే రైతులకు పరిహారం అందక నష్ట పోతున్నారని తెలిపారు. రైతులను కోటీశ్వరులు చేస్తామన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అడుగడుగునా రైతులను అగం చేస్తోందని ధ్వజమెత్తారు వివేక్. కమిషన్లు వచ్చే చోట మాత్రమే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని దుయ్యబట్టారు.

కాళేశ్వరంలో మోటార్లు నీట మునగగా.. రూ.1200 కోట్లు కాంట్రాక్ట్ ను మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిన ప్రభుత్వం.. రైతులకు మాత్రం పరిహారం ఇవ్వడం లేదని ఆగ్రహించారు వివేక్ వెంకటస్వామి. మిల్లర్ల దోపిడీని ప్రభుత్వం అరికట్టాలని..పంటలు దెబ్బతిన్న రైతులకు ఎకరాకు రూ. 20 వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారాయన. ప్రతి గింజా ధాన్యం కొనుగోలు చేయాలన్న వివేక్ వెంకటస్వామి..రాష్ట్రంలో ఫసల్ భీమా అమలు చేయాలన్నారు. 

కర్ణాటక ఎన్నికలపై వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యలు..

కర్ణాటక రాష్ట్రంలో వచ్చేది డబుల్ ఇంజన్ బీజేపీ ప్రభుత్వమే అన్నారు వివేక్ వెంకటస్వామి. కర్ణాటక ప్రజలు తమ అభివృద్ధి బీజేపీతోనే అని కోరుకుంటున్నారని వెల్లడించారు. నార్త్ కర్ణాటకలో తాను చేసిన ప్రచారంలో ఈ విషయం స్పష్టంగా కనిపించిందని చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలను ప్రజలు నమ్మడం లేదని విమర్శలు చేశారు వివేక్ వెంటస్వామి.