- బీహార్లో బీజేపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం
భాగల్పూర్: గ్రామంలో అభివృద్ధి పనులు చేయకపోవడంతో బీహార్లో ఓ బీజేపీ ఎమ్మెల్యేను గ్రామస్థులు స్కూల్ క్లాస్ రూమ్లో బంధించి, తాళం వేశారు. తర్వాత ఆయన ఫోన్ను గుంజుకున్నారు. ఈ విషయాన్ని ఆ ఎమ్మెల్యేనే తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రధాని మోడీ 8 ఏండ్ల పాలనను ప్రజలకు వివరించేందుకు ఎమ్మెల్యే ఇంజనీర్ కుమార్ శైలేంద్ర బీహార్లోని లోక్మాన్పూర్ గ్రామానికి వెళ్లారు. తమ గ్రామంలో కోసి నది కోత నిర్వహణ పనులు చేపట్టకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు ఆయన్ను స్కూల్ క్లాస్ రూమ్లో బంధించి, తాళం వేశారు. ‘‘గ్రామస్థులు ఒక్కసారిగా నన్ను చుట్టుముట్టారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే స్కూల్ క్లాస్ రూమ్లో బంధించి, బయటి నుంచి తాళం వేశారు. తర్వాత నా ఫోన్ను కూడా లాక్కున్నారు’’అని తన ఫేస్బుక్ ఖాతాలో రాసుకొచ్చారు. కొన్ని కారణాల వల్ల ఆయా గ్రామాల్లో కోతను అరికట్టేందుకు ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదు. కోత నిర్వహణ పనులు ఎప్పుడు చేపడతారో చెప్పే వరకు ఎమ్మెల్యేను విడిచిపెట్టబోమని తెలిపారు. దాదాపు ఆయన్ను రెండు గంటల పాటు రూమ్లోనే బంధించారు.