యాదాద్రి, వెలుగు: ‘‘ఆరుకు ఆరు మాకే వచ్చాయని టీఆర్ఎస్ సంకలు గుద్దుకుంటోంది. మీ పార్టీపై గెలిచినోళ్లను కాపాడుకునేందుకు గోవా, ఢిల్లీలో క్యాంపులకు తీసుకెళ్లి.. మీరే డబ్బులిచ్చి.. దేవుడి మీద ప్రమాణం చేయించి.. ఓట్లు వేయించుకొని గెలిచి దానికే.. సంకలు గుద్దుకోవడం ఏమిటి” అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు ఎద్దేవా చేశారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో జరుగుతున్న బీజేపీ కార్యకర్తల శిక్షణా తరగతుల్లో మంగళవారం ఆయన పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన ఆరు జిల్లాల్లో టీఆర్ఎస్ మెంబర్లే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఓటర్లు తక్కువగా ఉన్నప్పటికీ ఆత్మాభిమానంతో బీజేపీ, కాంగ్రెస్ పరోక్షంగా ఈ ఎన్నికల్లో పోటీ చేశాయని చెప్పారు.
తెలంగాణ ప్రజలు నరేంద్రమోడీ పాలనకు ఆకర్షితులవుతున్నారని, ముఖ్యంగా జీన్స్ప్యాంట్ వేసుకున్న కొత్త ఓటర్లు బీజేపీవైపే చూస్తున్నారన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆకాంక్ష మేరకే ప్రధాని నరేంద్రమోడీ డీమానిటైజేషన్ చేశారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండాలన్న అంశంపై జరిగిన చర్చలో పాల్గొన్న బీఆర్ అంబేద్కర్.. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే.. ప్రతి పదేళ్లకు ఒకసారి డీమానిటైజేషన్ జరగాలని సూచించారని వెల్లడించారు. దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం బీజేపీకి మాత్రమే ఉందన్నారు. 2023 ఎన్నికల్లో కార్యకర్తల బలంతోనే అధికారంలోకి వస్తామని ఆయన చెప్పారు. ఈ శిక్షణా తరగతుల్లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.ప్రదీప్కుమార్, వెంకట రమణ, కేవీఎల్ఎన్ రెడ్డి, ఏనుగుల రాకేశ్ రెడ్డి తదితరులు మాట్లాడారు.