పల్టీలు కొట్టి 20 అడుగులు గాల్లోకి లేచిన కారు.. ముగ్గురు మహిళలు మృతి

పల్టీలు కొట్టి 20 అడుగులు గాల్లోకి లేచిన కారు.. ముగ్గురు మహిళలు మృతి
  • ముగ్గురు భారతీయ మహిళలు మృతి
  • ప్రమాదం తీవ్రతకు నుజ్జునుజ్జయిన కారు

సౌత్ కరోలినా: అమెరికాలో శనివారం జరిగిన ఘర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గుజరాతీ మహిళలు చనిపోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి పల్టీలు కొట్టి 20 అడుగులు గాల్లోకి ఎగిరింది. చివరకు ఓ చెట్టుపై ల్యాండయింది. సౌత్  కరోలినా రాష్ట్రంలోని గ్రీన్ విల్లే కౌంటీలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. మృతులను గుజరాత్ లోని ఆనంద్  జిల్లాకు చెందిన రేఖాబెన్  పటేల్, సంగీతాబెన్  పటేల్, మనీషాబెన్  పటేల్ గా గుర్తించారు. 

‘‘ఆ మహిళలు ప్రయాణిస్తున్న కారు పల్టీలు కొట్టి 20 అడుగులు గాల్లోకి లేచి చివరకు ఓ చెట్టుపై ల్యాండయింది. అంటే వారి వెహికల్  ఎంత వేగంగా ప్రయాణించిందో అర్థం చేసుకోవచ్చు. కారు అత్యంత వేగంగా ప్రయాణిస్తుండడంతో 4 నుంచి -6 వరుసలు ఉన్న రోడ్డుపై నుంచి పల్టీలు కొట్టింది. ప్రమాద తీవ్రతకు వారి వెహికల్  నుజ్జునుజ్జయిపోయింది. ఈ ఘటనలో ఇతర వాహనాలకు ప్రమాదమేమీ జరగలేదు” అని పోలీసు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎమర్జెన్సీ బృందాలు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించాయి. కాగా, ఆ మహిళలు ప్రయాణిస్తున్న కారులో డిటెక్షన్  సిస్టమ్  ఉండడంతో ప్రమాదం గురించి వారి కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో వారు సౌత్  కరోలినాలోని అధికారులను అప్రమత్తం చేశారు.