న్యూఢిల్లీ: పార్లమెంటు కొత్త భవనానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరును పెట్టాలన్న కేసీఆర్ డిమాండ్ పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెడుతున్న కేసీఆర్.. తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ఇచ్చిన హామీపై సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలుపర్చకుండా దళితులను మభ్య పెడుతున్నారని విమర్శించారు.
తెలంగాణలో దళిత బంధును కూడా పూర్తిగా అమలు చేయడం లేదన్నారు. తామే దళిత ప్రేమికులమని టీఆర్ఎస్ నాయకులు చెబితే నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరని ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. తెలంగాణకు దళితుడ్ని ముఖ్యమంత్రి చేస్తేనే దళితులకు అసలైన సాధికారత అని వ్యాఖ్యానించారు.