ఢిల్లీ: జాతీయ స్థాయిలో దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పతనానికి చేరువలో ఉందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ పరిణామాలు చూస్తుంటే ఆ పార్టీ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా ఉందని, అందుకే కొందరు కాంగ్రెస్ నేతలు పార్టీ వీడి బీజేపీలో చేరుతున్నారని విమర్శించారు. కుటుంబ పార్టీల పరిస్థితి ఎప్పటికైనా మారుతుందని కాంగ్రెస్ పార్టీని చుస్తే అర్ధమవుతుందన్నారు. వంశపారంపర్య పార్టీలకు ఇలాంటి ఇబ్బందులు తప్పవన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష సంక్షోభానికి అంతర్గత రాజకీయాలే కారణమన్నారు. భారత దేశ గౌరవాన్ని తగ్గించేలా సైనికుల స్థాయి తగ్గించేలా రాహుల్ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారుతుందన్నారు. రాహుల్ గాంధీ చేసే పనులతో కాంగ్రెస్పై ప్రజలకు నమ్మకం పోతుందన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కాబోతోందని, బీజేపీనే ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని నరసింహరావు చెప్పారు. ఏపీలో టీడీపీ కి సరైన నాయకత్వం లేదని, సోనియా గాంధీ ఏ విధంగా పార్టీకి దూరమయ్యారో అదే విధంగా చంద్రబాబు కనుమరుగవుతారన్నారు. కాంగ్రెస్ తరహా పరిణామాలు అధికారం లో లేని ప్రాంతీయ పార్టీలు ఎదుర్కోక తప్పదన్నారు.టీడీపీ నాయకుడైన లోకేష్ పై ప్రజలకు నమ్మకం లేదని, ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టిన పరిస్థితే టీడీపికి పడుతుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రజల అభిమానాన్ని చూరగోని అధికారం లోకి వస్తుందన్నారు.