కాళేశ్వరంపై కేసీఆర్ మాట మార్చిండు: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధ్వజం

కాళేశ్వరంపై కేసీఆర్ మాట మార్చిండు: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధ్వజం

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు తన ఘనతే అన్న కేసీఆర్.. ఇప్పుడు మాట మార్చిండని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. నాడు కాళేశ్వరంపై గొప్పలు చెప్పుకున్న మాజీ సీఎం ఇప్పుడు తప్పించుకుంటున్నారని విమర్శించారు. కాళేశ్వరం చెడిపోవడానికి బాధ్యుడు కేసీఆర్ అని, ప్రపంచంలో అతి పెద్ద ఇంజినీరింగ్ బ్లండర్ కాళేశ్వరం ఆయన చెప్పారు.

మిగతా ప్రాజెక్టుల్లో అవినీతి జరిగినా ప్రాజెక్ట్ మిగిలిందని.. కానీ, కాళేశ్వరంలో అవినీతి జరిగినా ప్రాజెక్ట్ మిగల్లేదని ఎద్దేవా చేశారు.  బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో వరిధాన్యం దిగుబడి పెరగలేదని, రాష్ట్రం మాత్రం అప్పులపాలైందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ అన్ని విధాలుగా తప్పు అని ఆయన తెలిపారు. తాను బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు కాళేశ్వరం కూడా ఒక కారణమన్నారు.