బీఆర్ఎస్ హయాంలో అడ్డగోలుగా ట్యాపింగ్.. ఫిర్యాదు చేస్తే తిరిగి నాపైనే కేసులు: MP విశ్వేశ్వర్ రెడ్డి

బీఆర్ఎస్ హయాంలో అడ్డగోలుగా ట్యాపింగ్.. ఫిర్యాదు చేస్తే తిరిగి నాపైనే కేసులు: MP విశ్వేశ్వర్ రెడ్డి
  • నా భార్య ఫోన్ కూడా ట్యాప్ చేశారు.. బీఆర్ఎస్ హయాంలో అడ్డగోలుగా ట్యాపింగ్: కొండా విశ్వేశ్వర్ రెడ్డి 
  • నేను భూమి అమ్మిన వ్యక్తి నుంచి రూ.13 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు రాయించుకున్నరు
  • నా స్నేహితుడి దగ్గర రూ.72 కోట్లు పట్టుకొని.. అవి నావేనని ప్రచారం చేశారు
  • నేను ఫిర్యాదు చేస్తే తిరిగి నాపైనే నాన్‌ బెయిలబుల్ కేసులు పెట్టారని వెల్లడి   
  • సిట్ విచారణకు హాజరై సాక్షిగా వాంగ్మూలం ఇచ్చిన బీజేపీ ఎంపీ 
  • మరో ఎంపీ రఘునందన్ రావుస్టేట్‌మెంటూ రికార్డు 
  • బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పీఏ ఫోన్‌ కూడా ట్యాప్‌ అయినట్టు గుర్తించిన సిట్

హైదరాబాద్‌, వెలుగు: గత బీఆర్ఎస్ హయాంలో అడ్డగోలుగా వందలాది మంది ఫోన్లను ట్యాప్ చేశారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. తనతో పాటు తన భార్య, అనుచరుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని చెప్పారు. ఫోన్‌ ట్యాపింగ్ ఇష్యూను పార్లమెంట్‌లో లేవనెత్తుతానని పేర్కొన్నారు. శుక్రవారం సిట్‌ ఆఫీసుకు వచ్చిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. సాక్షిగా అధికారులకు తన స్టేట్‌మెంట్ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత నా ఫోన్లను ట్యాప్ చేశారు. మునుగోడు, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల టైమ్‌‌‌‌లో నా ఫోన్ ట్యాప్ అయ్యింది. ఆ విషయాన్ని నేను అప్పుడే గుర్తించాను. ఆనాడు బీజేపీ మునుగోడు ఉప ఎన్నిక ఇన్‌‌‌‌చార్జ్‌‌‌‌గా ఉన్న వివేక్ వెంకటస్వామి సహా అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు, వారి కుటుంబసభ్యులు, అనుచరుల ఫోన్లను అడ్డగోలుగా ట్యాప్‌‌‌‌ చేశారు. 

అధికారులు వారెంట్‌‌‌‌ లేకుండా వచ్చి ఆఫీసుల్లో సోదాలు చేశారు. కొందరు అధికారులు దౌర్జన్యం కూడా చేశారు. నా స్నేహితుడు బంగారం కొనుగోలు చేసేందుకు పెట్టుకున్న రూ.72 కోట్లు పట్టుకొని.. ఆ డబ్బు నాదే అన్నట్టు ప్రచారం చేశారు. నా భూమి కొనుగోలు చేసిన వ్యక్తిని హింసించి, రూ.13 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు రాయించుకున్నారు. ఈటల రాజేందర్‌‌‌‌‌‌‌‌కు డబ్బులు ఇచ్చినట్టు నిందలు మోపారు. వీటిపై నేను ఫిర్యాదు చేస్తే తిరిగి నాపైనే నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారు” అని విశ్వేశ్వర్ రెడ్డి వెల్లడించారు. 

అనుమానం ఉంటే సిట్‌‌‌‌ను సంప్రదించవచ్చు.. 

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, కాంగ్రెస్‌‌‌‌ లీగల్‌‌‌‌ సెల్‌‌‌‌ కామారెడ్డి ఇన్‌‌‌‌చార్జ్‌‌‌‌ దేవరాజ్‌‌‌‌ గౌడ్‌‌‌‌ కూడా శుక్రవారం సిట్‌‌‌‌ ఆఫీసుకు వచ్చారు. సాక్షులుగా తమ స్టేట్‌‌‌‌మెంట్ ఇచ్చారు. మరోవైపు బీజేపీ ఎంపీ రఘునందన్‌‌‌‌ రావు స్టేట్‌‌‌‌మెంట్ కూడా సిట్ అధికారులు రికార్డు చేశారు. తన ఫోన్ ట్యాప్ చేశారని రఘునందన్ పలుమార్లు పేర్కొన్న నేపథ్యంలో ఆయన నుంచి సిట్ అధికారులు సమాచారం సేకరించారు. 

కాలి గాయంతో సికింద్రాబాద్‌‌‌‌లోని యశోద హాస్పిటల్‌‌‌‌లో ట్రీట్‌‌‌‌మెంట్ పొందుతున్న రఘునందన్‌‌‌‌ను అధికారులు శుక్రవారం కలిశారు. సాక్షిగా స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ రికార్డ్ చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో తన ఫోన్ ట్యాప్ అయినట్టు సిట్‌‌‌‌కు రఘునందన్ తెలిపారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. కాగా, ఫోన్ ట్యాప్ అయినట్టు ఎవరికైనా అనుమానాలు ఉంటే తమను సంప్రదించి వివరాలు ఇవ్వాలని సిట్ అధికారులు సూచించారు.  

కవిత పీఏ ఫోన్ ట్యాప్.. 

కవిత పీఏ ఫోన్ నంబర్ కూడా ట్యాప్ అయినట్టు సిట్ గుర్తించింది. సాక్షులు వెల్లడిస్తున్న వివరాల ఆధారంగా నిందితులను మరోసారి విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఐదు రోజుల విచారణలో ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆధారంగా ప్రణీత్ రావు నుంచి కీలక ఆధారాలు సేకరిస్తున్నది. ఈ క్రమంలోనే ప్రణీత్‌‌‌‌రావును ప్రతిరోజు విచారణకు పిలుస్తున్నది.