
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై బీజేపీ ఎంపీ రఘునంద న్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేసులో సిట్ విచారణ ఎటు పోతుందో అర్థం కావడం లేదన్నారు. తాను దుబ్బాక ఉప ఎన్నికల టైమ్ లోనే తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఫిర్యాదు ఇచ్చానని, కానీ ఇప్పటివరకూ తనను సిట్ విచారణకు పిలవలేదన్నారు. కానీ ఈ కేసుకు సంబంధం లేని కాంగ్రెస్ నేతలను విచారణకు పిలుస్తున్నారన్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. తాను అసలు ఫోన్ ట్యాపింగ్ బాధితుడినని, తనను విచారణకు పిలవకుంటా ఎవరెవరినో పిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసును గాంధీ భవన్, జూబ్లీహిల్స్ మధ్య పంచాయతీలా మార్చారని, సిట్ కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు రఘునందన్ రావు. బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా తన ఫోన్ ట్యాపింగ్ కు గురైందన్నారు. పోలీసులు విచారణకు పిలిస్తే వాంగ్మూలం ఇస్తానని చెప్పారు.
మరో వైపు ఇవాళ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పీఎస్ లో పోలీసులు ఆయనను ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆయన స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు పోలీసులు.
2023 నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు భారీగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు దర్యాప్తు అధికారులు తేల్చిన సంగి తెలిసిందే. 4013 ఫోన్ నంబర్లను మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అండ్ టీమ్ ట్యాపింగ్ చేసినట్లు తేలింది. ఫోన్ ట్యాపింగ్ బాధితులు 618 మంది ఉండగా.. ఇందులో పొలిటికల్ లీడర్లు కూడా ఉన్నారు.618 మందిలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ , పారిశ్రామిక వేత్తలు, జర్నలిస్టులు కూడా ఉండటం గమనార్హం. రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు, బండి సంజయ్ కుటుంబ సభ్యులు, ఈటెల రాజేందర్ ఆయన కుటుంబ సభ్యులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు అనుచరుల ఫోన్లు ట్యాప్ అయినట్లు దర్యాప్తులో వెల్లడైంది.