
లక్నో: అమేథీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ను మట్టికరిపించి పార్టీనే కాదు.. కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీసింది బీజేపీ. ఐదేళ్ల పక్కా ప్లాన్తో స్మృతీ ఇరానీని రంగంలోకి దింపి ఏకంగా 50 వేల మెజార్టీతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది ఊహించే కావొచ్చు.. రాహుల్ వయోనాడ్లో పోటీ చేసి లోక్సభకు లైన్ క్లియర్ చేసుకున్నారు. అమేథీలో గెలిచిన ఊపులో బీజేపీ అధినాయకత్వం ఇప్పుడు సోనియా గాంధీ సొంత నియోజకవర్గం రాయ్ బరేలీపై కన్నేసింది. సోనియా 2004 నుంచీ ఈ స్థానంలో గెలుస్తూ వస్తున్నారు. రాయ్ బరేలీ అంటే సోనియా.. సోనియా అంటే రాయ్ బరేలీ అనుకునే పరిస్థితి. కానీ ఇప్పుడాపరిస్థితి మార్చాలని బీజేపీ తహతహలాడుతోంది. యూపీలో బీజేపీ అధికారంలో ఉండడమూ ఆ పార్టీకి కలిసొచ్చే ప్రధానాంశం. దీంతో స్టేట్, సెంట్రల్ బడ్జెట్తో రాయ్ బరేలీ పరిధిలో విస్తృతంగా మౌలిక సదుపాయాల కల్పనకు సిద్ధమైంది. పార్టీ క్యాడర్ను కూడా విపరీతంగా పెంచుకుంటోంది. అమేథీలో స్మృతీ ఇరానీ అనుసరించిన విధానాన్నే ఇక్కడా అమలు చేయాలని బీజేపీ యోచిస్తోంది. ఇరానీ 2014లో రాహుల్పై తొలిసారి పోటీ చేసి ఓడిపోయారు. అయినా నియోజకవర్గాన్ని వదలకుండా 2019 వరకు అంటిపెట్టుకుని ఉన్నారు. క్యాడర్ను ప్రోత్సహిస్తూ కేంద్రం అండతో ప్రతి లోకల్ సమస్యపైనా దృష్టి పెట్టి పరిష్కరిస్తూ పోయారు. ప్రతి గ్రామంలో ఆమె పర్యటన సాగింది. గ్రామ స్థాయి కార్యకర్తలతోనూ నేరుగా మాట్లాడి పార్టీ పరిస్థితిని మెరుగుపరిచారు.
పట్టున్న నేతతోనే బీజేపీ గేమ్ ప్లాన్
ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో రాయ్ బరేలీలో సోనియాపై ఓడిపోయిన సీనియర్ లీడర్ దినేశ్ ప్రతాప్ సింగ్ను ముందు పెట్టి బీజేపీ కథ నడిపిస్తోంది. దినేశ్ ప్రతాప్ సింగ్ 2018 ప్రారంభంలో కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. ఈయన స్థానికంగా పలుకుబడి ఉన్న నేత. 2017 యూపీ అసెంబ్లీ ఎలక్షన్స్లో రాయ్ బరేలీ పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ మూడింటిని కైవసం చేసుకుని పట్టు బిగించింది. ఇక్కడ రెండు స్థానాలతోనే కాంగ్రెస్ సరిపెట్టుకుంది.
అభివృద్ధితోనే గ్రౌండ్ వర్క్ మొదలు
యూపీ సీఎం యోగీ ఈ ఐదు నియోజకవర్గాలను ప్రత్యేక దృష్టితో చూస్తున్నారు. పోయిన మంగళవారం రాయ్ బరేలీ సమీపంలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏఐఐఎంఎస్) ఏర్పాటుకు యోగీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. 2020, ఏప్రిల్ వరకు దీన్ని పూర్తి చేయాలని టైం సెట్ చేసుకున్నారు. అదే విధంగా రాయ్ బరేలీ మీదుగా మీరట్ నుంచి ప్రయాగ్రాజ్ వరకు రైల్వే మార్గాన్ని సైతం ఈ డిసెంబర్ వరకు పూర్తి చేయాలని కేంద్రం టార్గెట్గా పెట్టుకుంది. ఈ రైల్వే మార్గం ఎన్నాళ్లుగానో స్థానికుల డిమాండ్. 2016 లోనే రాయ్ బరేలీని స్మార్ట్ సిటీగా ఎంపిక చేసేందుకు ప్రయత్నించినా కుదర్లేదు. ‘రాయ్ బరేలీని స్మార్ట్ సిటీగా ప్రకటించకపోయినా ఇక్కడ అంతకంటే ఎక్కువ డెవలప్మెంట్ జరుగుతోంది. ‘అమృత్ మిషన్’ ‘నమామీ గంగా’ వంటితోపాటు ఏఐఐఎంఎస్ ఈ ప్రాంత అభివృద్ధికి దోహం చేస్తున్నాయి. నేషనల్ హైవేస్ వెడల్పు చేస్తున్నాం. ట్రాన్స్ పోర్ట్ మెరుగైంది. ఇటీవలే ఐదు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాం. వివిధ ఉత్పత్తులు తయారు చేసే ఈ కంపెనీల ఏర్పాటుతో ఈ ప్రాంతం రూపు మారిపోనుంది’ అని జిల్లా కలెక్టర్ నేహా శర్మ చెబుతున్నారు.
ఉద్యోగాల కల్పనపైనా దృష్టి
గత ఏడాది డిసెంబర్లో ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ మోడ్రన్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. నిజానికి ఈ ప్రతిపాదన 2007 నాటిది. అప్పడు బీఎస్పీ హయాంలో కొంత వరకు ప్రయత్నాలు జరిగినా ఆ తర్వాత మూలన పడింది. ఇప్పుడు దాన్ని బీజేపీ తెరపైకి తెచ్చింది. అది పూర్తయితే ఉద్యోగాలు దొరుకుతాయని యువత ఆశపడుతోంది. సౌభాగ్య, ఉజ్వల, స్వచ్ఛ్ భారత్, ప్రతి ఇంటికి విద్యుత్, ఎల్పీజీ గ్యాస్, టాయిలెట్స్.. ఇలా అనేక స్కీమ్లను ఇక్కడ భారీగా అమలు చేస్తున్నారు.