గాంధీ భవన్ ముట్టడికి బయల్దేరిన బీజేపీ.. అడ్డుకున్న పోలీసులు

గాంధీ భవన్ ముట్టడికి  బయల్దేరిన బీజేపీ.. అడ్డుకున్న పోలీసులు

భజరంగ్ దళ్ ను నిషేదిస్తామని కర్ణాటకలో కాంగ్రెస్  మేనిఫేస్టోలో పెట్టడం వివాదాస్పదంగా మారింది.  కాంగ్రెస్ మేనిఫేస్టోకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు, భజరంగ్ దళ్ నేతలు  ఆందోళనలకు దిగారు.  కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు, నేతల ఇళ్ల ముట్టడికి యత్నించారు.

హైదరాబాద్ లోని బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. గాంధీ భవన్ దగ్గర హనుమాన్ చాలీసా పఠనం చేసేందుకు ర్యాలీగా బయల్దేరిన బీజేపీ నేతలను పార్టీ ఆఫీస్ వద్దే అడ్డుకున్నారు పోలీసులు. దీంతో బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా  నినాదాలు చేశారు. జై శ్రీరాం అంటూ నినాదాలు చేస్తూ బారీకేడ్లపై దూసుకెళ్లారు. దీంతో పోలీసులకు ,బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.  బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

అటూ గాంధీ భవన్ దగ్గర హై టెన్షన్ నెలకొంది. భజ రంగ్ దళ్ నేతలు హనుమాన్ చాలీసా పఠనం చేసేందుకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. భజరంగ్ దళ్ నేతలకు పోటీగా కాంగ్రెస్ మహిళా నేతలు కూడా హనుమాన్ చాలీసా పఠనం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది.

నిజామాబాద్ లోనూ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. హనుమాన్ చాలీసా పఠనం కోసం కాంగ్రెస్ కార్యాలయానికి బయల్దేరిన బీజేపీ కార్యకర్తలను  పోలీసులు అడ్డుకున్నారు.  నడిరోడ్డు పై బైఠాయించి హనుమాన్ చాలీసా పఠనం చేశారు బీజేపీ నేతలు.  బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్ పాల్ సూర్యనారాయణ సహా 100 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు 

జగిత్యాల జిల్లాలో   కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటి వద్ద బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు.  భజరంగ్ దళ్ ను బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టలో నుండి తీసేయాలని డిమాండ్ చేశారు.  హిందూ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు.