నిర్మల్లో బీజేపీ నేతల నిరసనలు

నిర్మల్లో బీజేపీ నేతల నిరసనలు

నిర్మల్ జిల్లాలో బీజేపీ నిరసనలు కొనసాగుతున్నాయి. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దళితులపై చేసిన వ్యాఖ్యలపై కమలం నేతలు మండిపడుతున్నారు. ఇంద్రకరణ్ రెడ్డి దళితులకు క్షమాపణ చెప్పాలని ఆయన దిష్టిబొమ్మ దహనం చేశారు. 2 రోజుల క్రితం నర్సాపూర్ మండల కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి దళిత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

తమ ఇష్టం ఉన్నవారికి దళిత బంధు ఇస్తామని... అడగడానికి మీరెవరంటూ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ప్రశ్నించారు. దీంతో ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యలపై జిల్లా వ్యాప్తంగా బీజేపీ నేతలు నిరసనలు తెలుపుతున్నారు. ఇవాళ నిర్మల్ జిల్లా కేంద్రంలో మంత్రికి వ్యతిరేకంగా నల్ల జెండాలతో ఆందోళన చేశారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు.