ఫిబ్రవరి 10 నుంచి బీజేపీ రథయాత్ర

ఫిబ్రవరి 10 నుంచి బీజేపీ రథయాత్ర
  • భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్​పరిధిలోని జనగామలో ప్రారంభం 

హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా బీజేపీ రథయాత్రకు ప్లాన్​ చేసింది. వచ్చే నెల10 నుంచి 19 వరకు తొలుత నాలుగు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ యాత్ర చేపట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది. ‘ఫిర్​ ఏక్ బార్ మోదీ సర్కార్’ నినాదంతో జనంలోకి వెళ్లాలనే ఉద్దేశంతో జాతీయ పార్టీ సూచన మేరకు రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం ఈ యాత్రను చేపడుతోంది.

సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గ క్లస్టర్ మీటింగ్ జరిగింది. ఈ క్లస్టర్ పరిధిలోని హైదరాబాద్, భువనగిరి, మల్కాజిగిరి, సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి యాత్ర తేదీలు ఖరారు చేశారు. వచ్చే నెల 10న  భువనగిరి పార్లమెంట్ పరిధిలోని జనగామలో రథయాత్ర ప్రారంభం కానుంది.

అక్కడి నుంచి ఆ యాత్ర 13న మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోకి ప్రవేశిస్తుంది. 17,18 తేదీల్లో హైదరాబాద్ సెగ్మెంట్​లో సాగనుంది. 19న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కొనసాగి.. అదే రోజు ముగియనుంది. ఇందులో పార్టీ జాతీయ నేతలు పాల్గొనే అవకాశం ఉంది. మిగిలిన నాలుగు లోక్ సభ నియోజకవర్గాల క్లస్టర్లలో రథయాత్రకు  సంబంధించిన తేదీలు త్వరలోనే ఖరారు కానున్నాయి.

5 నుంచి అయోధ్యకు  ప్రత్యేక రైళ్లు

రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి అయోధ్యకు ప్రత్యేక  రైళ్లు నడిపేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్య దర్శన్ అభియాన్ పేరుతో  వచ్చే నెల 5న సికింద్రాబాద్  నుంచి మొదటి రైలును ప్రారంభించనున్నారు. వచ్చే నెల 21న చివరగా జహీరాబాద్  పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రత్యేక రైలు అయోధ్యకు వెళ్లనుంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి నాయకత్వంలో ఇప్పటికే అయోధ్య దర్శన్ అభియాన్ పేరుతో ప్రత్యేక కమిటీని బీజేపీ రాష్ట్ర పార్టీ ఏర్పాటు చేసింది. అక్కడ దర్శన ఏర్పాట్ల కోసం బీజేపీ రాష్ట్ర పార్టీ తరఫున ప్రత్యేక వలంటీర్లను ఏర్పాటు చేసింది.