డబుల్ ఇంజన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యం

డబుల్ ఇంజన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యం

హైదరాబాద్: డబుల్ ఇంజన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ అన్నారు. వచ్చే నెలలో  హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే జులై 3న జరిగే మోడీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ... రాష్ట్ర రాజకీయ చరిత్రలో మోడీ బహిరంగ సభ గొప్ప సభ గా నిలిచిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. మోడీ సభకు లక్షల మంది ప్రజలు, కార్యకర్తలు వస్తున్నారని తెలిపారు. బంగారు భవిష్యత్తు కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని అన్నారు. రాష్ట్ర ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బంగారు కుటుంబంగా మారింది తప్ప ప్రజలకు ఒరిగిందేమీలేదన్నారు.  ఎన్నికల హామీలను అమలు చేయడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. అగ్నిపథ్ విషయంలో ప్రజలను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని, అగ్నిపథ్ వల్ల ఆర్మీ మరింత పటిష్టం అవుతుందని డీకే అరుణ అన్నారు.