మునుగోడులో బీజేపీ ఓడితే కేసీఆర్ మీటర్లు పెడ్తడు

మునుగోడులో బీజేపీ ఓడితే కేసీఆర్ మీటర్లు పెడ్తడు

జనగాం: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓడిపోతే రైతుల మోటర్లకు కేసీఆర్ మీటర్లు పెట్టడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. స్టేషన్ ఘన్ ఫూర్ నియోజకవర్గ  కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్, భజరంగదళ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని బండి సంజయ్ ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీజేపీ గెలిస్తే మోటర్లకు మీటర్లు పెడ్తారని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే వరంగల్ భద్రకాళి అమ్మ మీద ఒట్టేసి నిజం చెప్పాలని కేసీఆర్ కు సవాలు విసిరారు. మోటర్లకు మీటర్లు పెట్టడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని  చెప్పారు. 

పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేయలేని దద్దమ్మ కేసీఆర్ అని ధ్వజమెత్తారు. అకాల వర్షాల వల్ల రైతులు, ఉద్యోగాల్లేక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటుంటే పరిహారం ఇవ్వని కేసీఆర్... పంజాబ్ రైతులకు మాత్రం పరిహారం ఇచ్చారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు చేసుకున్న పాపమేంటనీ ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, డబుల్ బెడ్రూం ఇళ్లు, నక్కలగండి, డిండి ప్రాజెక్ట్స్, పెన్షన్స్ ఏమయ్యాయని ప్రశ్నించారు. మునుగోడులో బీజేపీ సభ సక్సెస్ కావడంతో కేసీఆర్ కు నిద్రపట్టడం లేదని ఆరోపించారు. మునుగోడులో టీఆర్ఎస్, కమ్యూనిస్టు, కాంగ్రెస్ గుంట నక్కలు కలిసి పోటీ చేస్తాయని, కానీ బీజేపీ మాత్రం సింగిల్ గానే బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అవినీతి, రాచరిక పాలన సాగుతోందన్న బండి సంజయ్... ఒక్కసారి బీజేపీకి అధికారం ఇవ్వాలని కోరారు.