ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ప్రజలకు అబద్ధాలు చెప్పాడన్నారు. బుధవారం అసెంబ్లీలో కేంద్రం తీసుకొస్తున్న కొత్త విద్యుత్ చట్టం ప్రమాదకరమన్న సీఎం వ్యాఖ్యలపై మండిపడ్డ సంజయ్.. రైతులకు ఉచిత విద్యుత్ పేరుతో కేసీఆర్ చేస్తున్న మాయాజాలం బయట పడుద్దనే అబద్ధాలు మొదలు పెట్టాడన్నారు. విద్యుత్ సవరణ చట్టంతో ఉద్యోగాలు పోతాయని, కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని తప్పుబట్టారు. విద్యుత్ బిల్లు డ్రాఫ్ట్ మాత్రమే వచ్చిందని, పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టలేదు కానీ కేసీఆర్ మాత్రం రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడని అన్నారు. విద్యుత్ సంస్కరణలు ప్రధాని మోడీకి తెలుసని అన్నారు
విద్యుత్ చట్ట సవరణ మంచిదే అని ఏపీ సీఎం, నీ తమ్ముడు జగన్ ఎందుకు చెప్పాడని సంజయ్ సీఎం ను ప్రశ్నించారు. జగన్ ఒక జీవో కూడా విడుదల చేశాడన్నారు. ‘అవసరమైతే మరొక సారి నీ తమ్ముడు జగన్ ను ప్రగతి భవన్ కు పిలిపించుకొని దావత్ ఇవ్వు.. విద్యుత్ చట్ట సవరణ గురించి చెప్తాడని’ అన్నారు సంజయ్.
