వరదలు వచ్చినా, ప్రమాదాలు జరిగినా… కేసీఆర్ మాత్రం బాధితుల వద్దకు వెళ్లరు

వరదలు వచ్చినా, ప్రమాదాలు జరిగినా… కేసీఆర్ మాత్రం బాధితుల వద్దకు వెళ్లరు

హైదరాబాద్: శ్రీశైలం పవర్ ప్రాజెక్టులో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన డివిజినల్ ఇంజనీర్ శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన ప్రాణం పోతుందని తెలిసినా ప్రభుత్వ ధనాన్ని కాపాడాలనే ఉద్దేశంతో కోట్ల రూపాయల విలువైన పరికరాలను అగ్నికి ఆహుతి కాకుండా తన ప్రాణాలకు సైతం తెగించి పోరాడిన వ్యక్తి శ్రీనివాస్ అని పేర్కొన్నారు. వారి ప్రాణత్యాగానికి ఎన్ని కోట్ల పరిహారం ఇచ్చినా.. తక్కువేనని అన్నారు. ప్ర‌భుత్వం బాధిత కుటుంబాల‌కు కంటి తుడుపు పరిహారాలు ఇవ్వడం కాకుండా.. వారి కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు.వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్ల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగుల మృతిపై సీఎం కేసీఆర్ స్పందించక పోవడం దారుణమన్నారు. వరదలు వచ్చినా, ప్రమాదాలు జరిగినా… కేసీఆర్ మాత్రం బాధితుల వద్దకు వెళ్లరని, వారిని పరామ‌ర్శించరని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని అన్నారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.. శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులను ఫోన్ లో పరామర్శించారు. వారు ధైర్యాన్ని కోల్పోకుండా మనోధైర్యంతో ముందుకు సాగాలి అని కోరారు.