కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చెయ్యండి

కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చెయ్యండి

సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ లేఖ

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్‌ ప్యాకేజీపై సీఎం కేసీఆర్ లేని పోని విమర్శలు చేస్తున్నార‌ని రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఆరోపించారు. దేశ, రాష్ట్రాల బాగు కోసం ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ ఈ ప్యాకేజీని ప్ర‌క‌టిస్తే.. త‌మ‌ అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవటానికి, కేంద్ర ప్రభుత్వం పై అర్థరహిత విమర్శలు చేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. మాట‌ల గార‌డీతో రాష్ట్ర ప్రజలను ఇంకెన్ని రోజులు మోసం చేస్తారు? అని ప్ర‌శ్నిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు సంజ‌య్.

కేంద్ర ప్రభుత్వ ఉద్దీపనలు ఫ్యూడల్‌ విధానంలో ఉన్నాయని సీఎం అనటం, భూస్వామ్య విధానం, ఫ్యూడల్ స్వభావం గురించి మాట్లాడటం మరీ విడ్డూరంగా ఉందని అన్నారు . రాష్ట్రాల చేతుల్లోకి నగదు రావాలని చెబుతున్న కేసీఆర్.. కేంద్రం నేరుగా నగదు ఇస్తే మీ జేబులు నింపుకుందామనా? అభివృద్ధి పనుల పేరుతో కమీషన్లు దండుకుందామనా? అని అడిగారు. ఇప్పుడిక అలాంటివి సాధ్యం కాదని అన్నారు. ఎఫ్.ఆర్.బీ.ఎం పరిమితి సంస్కరణల పై అసంబద్ధమైన ఆరోపణలు చేశార‌ని, సంస్కరణలు తేవటం, ప్రభుత్వపాలనలో ఒక భాగమే న‌ని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు క్రమం తప్పకుండా అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నదని, కానీ, రైతు బంధు ద్వారా రైతులకు అలా అందడం లేదని అన్నారు బండి సంజ‌య్ . రైతు బంధు ఆర్థిక సహాయాన్ని, పంటల నియంత్రిత పద్ధతితో ముడిపెట్టడం ఎంతవరకు సమంజసమో స్పష్టం చెయ్యాలని సీఎం ను డిమాండ్ చేశారు. భవిష్యత్ లో రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తారా లేదా? అని చెప్పాల‌న్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రాష్ట్రానికి కోవిడ్ నిధులను ఇవ్వలేదా? అని లేఖ‌లో ప్ర‌శ్నించారు సంజ‌య్. NDRF కింద ఇచ్చిన రూ. 224 కోట్లు, మెడికల్ పరికరాల కోసం ఇచ్చిన రూ.216 కోట్లు, డివల్యూషన్ నిధులలో తొలి విడతగా ఇచ్చిన రూ.982 కోట్లు, ఎలా ఖర్చు చేశారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నారు. ఇచ్చిన నిధులను, ఎలా ఖర్చు పెట్టారో చెప్పకుండా, రాష్ట్ర ప్రజలకు ఏవేవో మాయమాటలు చెబుతున్నార‌న్నారు.” పీఎం కేర్స్ నిధుల నుంచి ప్రధాని, 3100 కోట్ల రూపాయలను వెంటిలేటర్ ల తయారీకి, వలస కార్మికుల కోసం, వాక్సిన్ అభివృద్ధికి కేటాయించారని, మరి, సీఎం రిలీఫ్ ఫండ్ కు, మీ కొడుకు కేటిఆర్ కు అందిన విరాళాలు మొత్తం ఎంత? మీరు వాటిని ఎలా ఖర్చు పెట్టారు? ఆ వివ‌రాల‌ను ప్రజలకు స్పష్టంగా చెప్పాలన్నారు. వలస కార్మికుల తరలింపు కోసం, మీరు ఖర్చు పెట్టారని చెపుతున్న డబ్బులు, కేంద్రం ఇచ్చిన విపత్తు నిధి నుంచా? లేదా వేరే నిధుల నుండి ఇవి వచ్చాయా? “అని ప్ర‌శ్నించారు .

కోవిడ్ వ్యాధిని ఎదుర్కొవటానికి తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చిన నిధులను మీరు ఎలా ఖర్చు పెట్టారో వివరిస్తూ శ్వేత పత్రం విడుదల చెయ్యాలని, భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని సంజయ్ అన్నారు.