మీ రాజకీయ అవసరాల కోసం రైతులను రెచ్చగొట్టొద్దు

మీ రాజకీయ అవసరాల కోసం రైతులను రెచ్చగొట్టొద్దు

ఈనెల 8వ తేదీన కొన్ని రైతు సంఘాలు,.. ముఖ్యంగా పంజాబ్ కు చెందిన రైతు సంఘాలు, కాంగ్రెస్ అనుబంధ రైతు సంఘాలు ప్రకటించిన భారత్ బంద్ కు టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు ఆ పార్టీ రాష్ట్ర‌ అధ్య‌క్షుడు బండి సంజ‌య్. పార్లమెంట్ లో ఆమోదం పొందిన బిల్లుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం అవగాహన లేకుండా మాట్లాడటం, కాంగ్రెస్ పార్టీ ప్రేరిత బంద్ లో పాల్గొనడం టీఆర్ఎస్ పార్టీ యొక్క రాజకీయ దివాళాకోరుతనాన్ని బయటపెడుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి తేడా లేదని.. ఈ బంద్ ద్వారా అర్థమవుతోందని సంజ‌య్ అన్నారు. రాజకీయ అవసరాల కోసం రైతులను రెచ్చగొట్టొద్దని , తెలంగాణ రైతులెవ్వరూ కూడా ఈ బంద్ లో పాల్గొనద్దని బిజెపి విజ్ఞ‌ప్తి‌ చేస్తోందన్నారు‌.

ముందు రుణ‌మాఫీ చేయండి

తెలంగాణ రాష్ట్రంలో ఆరు సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ రైతులకు ఒరగబెట్టింది ఏమిటో ‌స్పష్టం చేయాల‌‌ని బండి సంజ‌య్ అన్నారు. 2014 ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ రైతుల పంట రుణాలు మాఫీ చేస్తానని వాగ్ధానంచేసి 2019 వరకు విడతలవారీగా మాఫీ చేసిందని, 2018లో మరోసారి రైతు రుణాలు మాఫీ చేస్తానని వాగ్ధానం చేసి అధికారంలోకి వచ్చి రుణమాఫీ సంగతి మర్చిపోయారన్నారు. ముందు తెలంగాణ రైతులకు మీరు రుణమాఫీ చేసి.. ఆ తర్వాత రైతు సమస్యలపై స్పందిస్తే బాగుండేదన్నారు సంజ‌య్.

అదేం స‌ర్వ‌రోగ నివారిణి కాదు

తెలంగాణలో రూ. లక్ష లోపు వడ్డీలేని రుణాలు ఇవ్వాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వని కారణంగా రైతులు 13 శాతం వడ్డీలు చెల్లిస్తున్నారన్నారు. రైతుబంధు సర్వరోగ నివారిణి అని టీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోందని.. ఇప్పటికైనా రైతుల రుణమాఫీ ఆలస్యం కావడం పట్ల రైతులకు క్షమాపణ చెప్పాలని బిజెపి డిమాండ్ చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలు కావడం లేదని, ఫలితంగా రైతులు అకాల ‌వర్షాలు, కరువుతో తీవ్రంగా నష్టపోతున్నార‌న్నారు.

కేంద్ర నిధుల‌తోనే ట్రాక్టర్లు కొనిస్తున్నారు

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణకు నిధులు లేవని, సూక్ష్మ సేద్యానికి నీళ్లు ఇవ్వడం లేదన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులతో టీఆర్ఎస్ నాయకులు ట్రాక్టర్లు కొని ఇస్తున్నార‌న్నారు. ఇప్పటికైనా రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసి ఫసల్ బీమా యోజన, వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మ సేద్యం లాంటి పథకాలను అమలు చేయాలని బిజెపి డిమాండ్ చేస్తోందని.. అప్పటివరకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని బిజెపి భావిస్తోందన్నారు.

దమ్ము, ధైర్యం ఉంటే ఆ పని చేయండి

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులను నియమించుకొని రైతులకు అన్యాయం చేస్తున్నారని సంజ‌య్ మండిప‌డ్డారు. ఆ పార్టీ నియ‌మించిన‌ మార్కెట్ కమిటీ చైర్మన్లు, సభ్యులు.. దళారులతో కుమ్మక్కై రైతులకు గిట్టుబాటు ధర రాకుండా అవినీతికి పాల్పడుతున్నార‌న్న సంజ‌య్.. అది ప్రశ్నించిన రైతులను జైళ్లపాలు చేస్తున్నార‌న్నారు. ఇప్పటికైనా దమ్ము, ధైర్యం ఉంటే మార్కెట్ కమిటీలను రద్దు చేసి రైతు సంఘాలకే మార్కెట్ కమిటీల నిర్వ‌హ‌ణ‌ను అప్పజెప్పాలని బిజెపి డిమాండ్ చేస్తోందన్నారు.