తెలంగాణలో భూ మాఫియా, లిక్కర్ మాఫియా ఏరులై పారుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడిపిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో లక్షలాది మంది యువత రోడ్డున పడ్డారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని ఎద్దేవా చేశారు. మాటల గారడితో ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంధి ఔషపూర్ లో భారతీయ జనతా యువ మోర్చా తెలంగాణ మండల అధ్యక్షులు ఆపై స్థాయి నాయకుల సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు రెండు అవినీతి పార్టీలని కిషన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లు అని చెప్పారు. ఈ రెండు పార్టీలకు ఓటేస్తే..ఎంఐఎం పార్టీకి వేసినట్లే అని తెలిపారు. రాష్ట్రంలో మహిళలపై అనేక దాడులు జరిగినా పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు.
నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై సెప్టెంబర్ 13, 14వ తేదీల్లో ఇందిరా పార్కులో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ ధర్నాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.