
మునుగోడుతో పాటుగా 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికలు ఫలితాలు ఈ రోజు వెలువడ్డాయి. ఈ ఉపఎన్నికలో నాలుగు రాష్ట్రాల(బీహర్,ఉత్తరప్రదేశ్, హర్యానా, ఒడిశా)లో బీజేపీ విజయఢంకా మోగించింది. మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రే శివసేన వర్గం విజయం సాధించగా, తెలంగాణలో టీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేసింది.
తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 10,040 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు.
బీహార్ లోని మొకామా అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో రాష్ట్రీయ జనతాదళ్ అభ్యర్థి నీలం దేవి గెలుపొందారు. బీజేపీ అభ్యర్ధి సోనమ్ దేవీపై ఆమె పై 66 వేల 587 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
బీహార్ లోని గోపాల్గంజ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ సత్తా చాటింది. ఆ పార్టీ సమీప అభ్యర్థి కుసుమ్ దేవి 2183 ఓట్ల తేడాతో ఆర్జేడీ అభ్యర్థి మోహన్ ప్రసాద్ గుప్తా పై విజయం సాధించారు. 2005 నుంచి ఇక్కడ బీజేపీ ఓడిపోయింది లేదు.
ఉత్తరప్రదేశ్ లోని గోల గోకరనాథ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అమన్ గిరి విజయం సాధించారు. సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి వినయ్ తివారీ పై ఆయన 34,298 ఓట్లతో తెడాతో గెలిచారు.
మహారాష్ట్ర లోని అంధేరి ఈస్ట్ లో జరిగిన ఉపఎన్నికలో ఉద్దవ్ ఠాక్రే శివసేన అభ్యర్థి అయిన రుతుజా లట్కే ఘనవిజయం సాధించారు. రుతుజాకు మొత్తం 66,247 ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత 12,776 ఓట్లతో నోటా రెండో స్థానంలో నిలిచింది.
హర్యానా లోని ఆదంపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భవ్య బిష్ణోయ్ 16 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈయన హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ మనుమడు. భవ్య బిష్ణోయ్ వయసు ప్రస్తుతం 29 సంవత్సరాలు.
ఒడిశా లోని ధామ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలలో బీజేపీ అభ్యర్థి సూర్యవంశీ సూరజ్ .. బీజేడీ అభ్యర్తి అబంతి దాస్ పై 9,881 ఓట్ల తేడాతో గెలుపొందారు.