సార్వత్రిక ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్లో విషాదం చోటుచేసుకుంది. మొరాదాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కున్వర్ సర్వేష్ సింగ్ కన్నుమూశారు. ఈ విషయాన్ని యూపీ బీజేపీ చీఫ్ భూపేంద్ర చౌదరి వెల్లడించారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సర్వేష్ సింగ్ ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. సర్వేష్ సింగ్, ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా ఎన్నికయ్యారు.
సర్వేష్ సింగ్ మరణం బీజేపీ పరివార్కు తీరని లోటు అని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. మొరాదాబాద్ లోక్సభ స్థానానికి శుక్రవారం ఓటింగ్ పూర్తయింది. సర్వేష్ సింగ్ అంత్యక్రియలు ఆదివారం జరిగే అవకాశం ఉంది. సర్వేష్ సింగ్ కుమారుడు కున్వర్ సుశాంత్ సింగ్ ప్రస్తుతం బర్హాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.
also read : పెన్షన్ కోసం చనిపోయిన వ్యక్తితో బ్యాంకుకు వచ్చింది.. అడ్డంగా బుక్కయింది..
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం కున్వర్ సర్వేష్ సింగ్ గెలిస్తే మొరాదాబాద్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. మొరాదాబాద్ లోక్సభ స్థానానికి జరిగిన ఎన్నికల ప్రచారానికి సర్వేష్ సింగ్ కూడా గైర్హాజరయ్యారు. సర్వేష్ సింగ్ కుటుంబం అతని కోసం ప్రచారం చేసింది. ఉత్తరప్రదేశ్లో ఇప్పటివరకు ఎనిమిది లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది.