- నారాయణపేట జిల్లాలో ముందుకుపడని రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు
- రెవెన్యూ డిపార్ట్మెంట్అవసరమైన భూమిని అప్పగించినా ప్రారంభం కాని పనులు
- వేటగాళ్లు, రైతుల చేతిలో హతమవుతున్న అరుదైన జింకలు
మహబూబ్నగర్, వెలుగు : కృష్ణ జింక(బ్లాక్బక్)కు భద్రత కరువైంది. తమ పంటలను నాశనం చేస్తున్నాయని కొందరు రైతులు పొలాల్లో ఉచ్చులు బిగిస్తుంటే మరో వైపు వేటగాళ్లు వాటిని తుపాకులతో కాల్చి చంపుతున్నారు. ఈ వ్యవహారం ఏండ్లుగా కొనసాగుతున్నా ప్రభుత్వాలు వీటిని రీహాబిలిటేషన్ సెంటర్లకు తరలించే ఏర్పాట్లు చేయడంలో ఫెయిల్ అవుతున్నాయి.
12 వేలకు పైగానే కృష్ణ జింకలు..
నారాయణపేట జిల్లా తెలంగాణ-, కర్నాటక సరిహద్దులో ఉంది. ఈ ప్రాంతం మీదుగా తెలంగాణలోకి కృష్ణానది ప్రవహిస్తుంది. నీరు పుష్కలంగా ఉండడంతో ఏండ్లుగా ఇక్కడ కృష్ణ జింకలు ఉంటున్నాయి. పదేండ్ల కిందట వరకు వీటి సంతతి వందల సంఖ్యలో ఉండగా, ఇప్పుడు దాదాపు 12 వేలకు పైగానే పెరిగినట్లు ఫారెస్ట్ ఆఫీసర్లు చెబుతున్నారు. సంతతి పెరగడంతో వీటికి ఆహారం దొరకడం కష్టంగా మారింది. దీంతో గడ్డి మైదానాలను వీడుతున్నాయి.
ఆహారం కోసం నారాయణపేట జిల్లాలోని మాగనూరు, కృష్ణ, నర్వ, మరికల్, మక్తల్, ఊట్కూరు, నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర, కౌకుంట్ల, చిన్నచింతకుంట, వనపర్తి జిల్లాలోని అమరచింత, ఆత్మకూర్ ప్రాంతాలకు వస్తున్నాయి. ఈ ప్రాంతాల్లోని వరి, పల్లీ, పత్తి, ఇతర పంటలపై మందలుగా వచ్చి దాడి చేస్తున్నాయి. పిలక దశ నుంచే మొక్కలను తింటుండడంతో రైతులకు తీవ్రంగా నష్టం వస్తోంది.
దీంతో వాటిని వదిలించుకునేందుకు కొందరు రైతులు పొలాల్లో కరెంటు షాక్లు పెట్టడం, ఉచ్చులు బిగించడం చేస్తున్నారు. అవి చనిపోయాక వాటి ఆనవాళ్లు లేకుండా ఆ ప్రాంతాల్లోనే పాతి పెడుతున్నట్లు సమాచారం. కాగా, ఈ ప్రాంతంలో జింకల సంతతి పెరగడంతో బయటి నుంచి వేటగాళ్లు కూడా వస్తున్నారు. గతంలో నర్వ, చిన్నచింతకుంట ప్రాంతాల్లో కూడా జింకలను వేటాడి చంపారు. తాజాగా మక్తల్ ప్రాంతంలో జింకలను వేటాడి చంపిన ముఠాను గోల్కొండకు చెందిన టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
రీహాబిలిటేషన్ సెంటర్ ఏమైంది..?
కృష్ణ జింకల నుంచి తమ పంటలను కాపాడాలని ఈ ప్రాంత రైతుల దశాబ్దాలుగా ప్రభుత్వాలను కోరుతున్నారు. కొద్ది నెలల కిందట జిల్లా మీదుగా సాగిన ‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా ఈ ప్రాంత రైతులు రాహుల్ గాంధీని కలిసి సమస్య వివరించారు. అప్పటి బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్ బండి సంజయ్ జిల్లా మీదుగా నిర్వహించిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’లోనూ రైతులకు ఈ సమస్య గురించి ఆయనకు వివరించారు. కానీ ఇప్పటికీ రీ హాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటుపై స్పష్టత రావడం లేదు.
పది నెలల కిందట ఉమ్మడి మాగనూరు మండలంలోని సర్వే నంబరు 192లో 18.29 ఎకరాలు, 194లో 55.21 ఎకరాలను కలిపి మొత్తం 74.10 ఎకరాలను అప్పగించాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ను రాష్ర్ట ప్రభుత్వం ఆదేశించింది. ఇందులోనే చిన్న నీటి కుంట కూడా ఉంది. రెవెన్యూ ఆఫీసర్లు గత ఆగస్టులో ఈ భూమిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు అప్పగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. భూమి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉందో అక్కడ ఎర్ర జెండాలతో మార్కింగ్ కూడా చేశారు. జీపీఎస్ రికార్డ్ పూర్తి చేశారు. కానీ ఆ తర్వాత అడుగు ముందుకు పడడం లేదు.
కొరవడిన పర్యవేక్షణ..
ఏండ్లుగా ఈ ప్రాంతాల్లో కృష్ణ జింకలు ఉంటున్నా ఫారెస్ట్ ఆఫీసర్లు వాటిని పర్యవేక్షించడంలో ఫెయిల్ అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ జింకలు ఎక్కువగా ఏ ప్రాంతంలో తిరుగుతున్నాయి? జింకల మందలపై ఎవరైనా దాడులు చేస్తున్నారా? తదితర విషయాలపై నిఘా పెట్టడంలో విఫలమవుతున్నారు. జింకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. దీంతో ఏండ్లుగా జింకలు వేటగాళ్ల బారిన పడుతూనే ఉన్నాయి. తాజాగా టాస్క్ఫోర్స్ ఆఫీసర్లు పట్టుకున్న ముఠా సభ్యులు ఏడాది కాలంగా మక్తల్ ప్రాంతంలో దాదాపు పదికి పైగానే జింకలను చంపినట్లు తెలిసింది.
