ఎంత కోపం : క్యూలో రమ్మన్నాడు.. పానీపూరీ వ్యాపారిని కత్తితో పొడిచేశాడు

ఎంత కోపం : క్యూలో రమ్మన్నాడు.. పానీపూరీ వ్యాపారిని కత్తితో పొడిచేశాడు

పానీపూరీ తినడానికి వచ్చి..వ్యాపారినే చంపేందుకు యత్నించాడు ఓ వ్యక్తి. క్యూలో రమ్మన్నందుకు కత్తితో కసితీరా పొడిచాడు. అడ్డుకున్న వారిని కూడా చంపేస్తానంటూ బెదరించాడు. శనివారం(అక్టోబర్ 14) సాయంత్రం నోయిడాలోని బరౌలా లో క్యూలో వేచి ఉండమన్నందుకు పానీపూరి వ్యాపారి రవీంద్రకుమార్ ను కత్తితో పొడిచాడు వికాస్ వర్మ అనే వ్యక్తి. తీవ్రగాయాలపాలైన రవీంద్రకుమార్  ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

యూపీలోని నోయిడాకు చెందిన 30 యేళ్ల రవీంద్ర కుమార్ స్థానికంగా ఓ పానీపూరీ బండి ని నడుపుతున్నాడు. శనివారం ( అక్టోబర్ 14న ) సాయంత్రం రవీంద్రకుమార్ బండి దగ్గర పానీపూరి తినేందుకు  కస్టమర్లు కిటకిటలాడుతున్నారు. ఇదే సమయంలో  స్థానికంగా నివసించే నిందితుడు వికాస్ శర్మ (27) పానీపూరీ తినేందుకు అక్కడికి వచ్చాడు. చాలా మంది కస్టమర్లు లైన్ లో వేచివున్నారు. 
అయితే తనకే ముందు పానీ పూరి సర్వ్ చేయాలని వికాస్ శర్మ వ్యాపారి రవీంద్రకుమార్ తో గొడవపడ్డాడు.. మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో సైకోలో మారిన వికాస్ శర్మ  పానీపూరీ వ్యాపారి రవీంద్ర కుమార్ ను కత్తితో కసితీరా అనేక సార్లు పొడిచాడు. తీవ్ర గాయాలతో  రక్తపు మడుగులో కూలిపోయాడు రవీంద్ర కుమార్.. అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులు, కస్టమర్లను కూడా వికాస్ శర్మ  చంపుతానని బెదిరించాడు. 
బాధితుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులుకేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక టీం గాలిస్తున్నాయని పోలీసులు తెలిపారు.