బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ డియో వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నాగ్పూర్లోని బాంబే హైకోర్టు బెంచ్ కోర్టు హాలులో ఆయన ఈ ప్రకటన చేసినట్లు ఆ సమయంలో అక్కడే ఉన్న న్యాయవాది తెలిపారు. ఆత్మగౌరవం విషయంలో రాజీపడలేనని జస్టిస్ రోహిత్ డియో చెప్పినట్లు న్యాయవాది చెప్పారు.
కోర్టులో ఉన్న వారందరినీ (న్యాయవాదులు, కోర్టు సిబ్బంది) ఉద్దేశించి క్షమాపణలు కోరారు. మీపై ఎన్నోసార్లు ఆగ్రహం వ్యక్తం చేశానని, అయితే.. బాధపెట్టాలని మాత్రం తాను అలా చేయలేదని, మీరు మరింత మెరుగపడాలని అలా అన్నానని చెప్పారు. తాను తన పదవికి రాజీనామా చేశానని, తన ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా పనిచేయలేనని, మీరంతా కష్టపడి పని చేయాలని చెప్పారు జస్టిస్ రోహిత్ డియో.
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో అరెస్టైన ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ సాయిబాబాను జస్టిస్ రోహిత్ డియో గత ఏడాది నిర్దోషిగా ప్రకటించారు. ఆయనకు విధించిన జీవిత ఖైదును కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం ఈ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దాంతోపాటు నాగ్పూర్ -ముంబయి సమృద్ధి ఎక్స్ప్రెస్వేకు సంబంధించి జనవరి 3న మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానంపై కూడా జస్టిస్ రోహిత్ డియో గత వారం స్టే విధించారు. 2016 వరకు మహారాష్ట్ర అడ్వొకేట్ జనరల్గా పనిచేసిన ఆయన 2017లో బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2025 డిసెంబరుతో జస్టిస్ రోహిత్ డియో పదవీకాలం ముగియనుంది. కానీ.. రెండేళ్ల ముందే ఆయన తన పదవికి రాజీనామా చేశారు.