శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న బూర నర్సయ్య

 శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న బూర నర్సయ్య

ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.  శంషాబాద్ ఎయిర్ పోర్టులో శంషాబాద్, మునుగోడు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. 2023 డిసెంబర్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ను బొంద పెట్టడం ఖాయమని బూర నర్సయ్య గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇన్నాళ్లూ పంజరంలో చిలుకగా ఉన్న తాను.. ఇప్పుడు పంజరం నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛా జీవినయ్యానని చెప్పారు. ఇకనుండి టీఆర్ఎస్ అంతానికే తన పోరాటం ఉంటుందని స్పష్టం చేశారు. చౌటుప్పల్ లో ఫ్లోరైడ్ సమస్య 8 ఏళ్లకు ముందు అంతమైందా లేకుంటే ఇప్పుడు తొలగిపోయిందో తెలపాలని  టీఆర్ఎస్ నాయకులు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఇటీవలే బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్‌ చుగ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్న ఆయన... కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ చేతుల మీదుగా బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ తెలిపారు.‘అందరి తెలంగాణ, అభివృద్ధి తెలంగాణ’ కోసం పనిచేస్తానని వెల్లడించారు. కొందరి కోసమే తెలంగాణ ఏర్పడలేదన్న బూర నర్సయ్య... రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవడానికి కృషిచేస్తానని స్పష్టం చేశారు.