
సంగారెడ్డి, వెలుగు: ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ఓ తండ్రి తన కొడుకు కడసారి చూపు కోసం పాశమైలారం వచ్చాడు. డీఎన్ఏ పరీక్షలకోసం వెంటనే రావాలని అధికారులు చెప్పడంతో అప్పు చేసి మరీ విమానంలో హైదరాబాద్కు చేరుకున్నాడు. పాశమైలారం సిగాచి ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో ఇప్పటివరకు 39 మంది చనిపోగా.. ఇందులో అజయ్ మండల్ (19) కూడా ఉన్నాడు.
విషయం తెలుసుకొని బంధువుల సలహా మేరకు అతడి తండ్రి అధికారులను సంప్రదించగా.. డీఎన్ఏ టెస్ట్ కోసం త్వరగా రావాలని అధికారులు తెలిపారు. డెడ్ బాడీ కుళ్లిపోయే అవకాశం ఉందని చెప్పారు. దీంతో చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా ఆ తండ్రి తెలిసిన వారి దగ్గర రూ.30 వేలు అప్పు చేసి.. మరొకరి సాయంతో విమానం టికెట్టు తీసుకుని బయలుదేరి వచ్చాడు. గురువారం సాయంత్రం డీఎన్ఏ టెస్ట్ కోసం రక్తం ఇవ్వగా, అధికారులు అజయ్ బెడ్బాడీని గుర్తించారు. మాంసం ముద్దగా మారిన కొడుకు మృతదేహాన్ని చూసిన ఆ తండ్రి కన్నీరు మున్నీరయ్యారు.
ఊర్లో ఉపాధిలేక..
తమది పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ ప్రాంతమని సుభాష్ తెలిపాడు. తమది పేద కుటుంబం అని, అక్కడ అజయ్కి చేసుకునేందుకు పనిదొరక్కపోవడంతో తెలిసిన వారి సహాయంతో నెల కిందటే పాశమైలారం వచ్చాడని చెప్పాడు. ఇక్కడి సిగాచి పరిశ్రమలో సుమారు 20 రోజుల క్రితం కార్మికునిగా చేరాడని, ఇంకా నెల జీతం కూడా తీసుకోలేదని తెలిపాడు. అంతలోనే ఈ దుర్ఘటన జరిగిందంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.