లిఫ్ట్ లో ఇరుక్కుని బాలుడి మృతి

లిఫ్ట్ లో ఇరుక్కుని బాలుడి మృతి

హైదరాబాద్‌ :  ప్రమాదవశాత్తు లిఫ్ట్ లో తల ఇరుక్కుని ఓ బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన మేడ్చల్ , బాలాజీ నగర్ లో ఇవాళ ఉదయం జరిగింది. బాలాజీనగర్‌ లోని తిరుమల నిలయం అపార్ట్‌ మెంట్‌ లో.. మూడో అంతస్తు నుంచి లిఫ్ట్‌ లో కిందకు వస్తున్నాడు. ఇంతలో బాలుడి తల.. ప్రమాదవశాత్తు లిఫ్ట్‌ గ్రిల్స్‌ మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతి చెందిన బాలుడిని అపార్ట్‌ మెంట్‌ వాచ్‌ మెన్‌ కొడుకు హేమంత్‌ కుమార్‌(8) గా పోలీసులు గుర్తించారు. అప్పటివరకు ఆడుకుంటున్న కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. హేమంత్‌ స్వస్థలం ప్రకాశం జిల్లా. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.