ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

దుబ్బాక, వెలుగు: సమాజంలోని ప్రస్తుత పరిస్థితులలో ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలని ఎమ్మెల్యే   రఘునందన్​రావు విద్యార్థినులకు సూచించారు. శుక్రవారం కరాటే  నేషనల్​టోర్నమెంట్​లో సత్తా చాటిన మిరుదొడ్డి కస్తూర్భా గాంధీ స్కూల్​స్టూడెంట్లకు ఎమ్మెల్యే  మెడల్స్​అందజేశారు.  ఇటీవల హైదరాబాద్​లోని కోట్ల విజయభాస్కర్​ రెడ్డి ఇండోర్​ స్టేడియంలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్​ షిప్–​ 2022  లో విద్యార్థినులు సత్తా చాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిరుదొడ్డి  గర్ల్స్​స్కూల్​నుంచి 32 మంది విద్యార్థినులు పాల్గొనగా 8 మంది గోల్డ్​, 8 మంది సిల్వర్​, 18 మంది బ్రౌంజ్​ మెడల్స్​సాధించారన్నారు. కరాటే నేర్చుకున్న వాళ్లు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని, మహిళలపై జరుగుతున్న దాడులను ఈజీగా ఎదుర్కోవడమే కాకుండా..  ప్రతి దాడి చేసే ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటారన్నారు.  ఈ కార్యక్రమంలో ఎంఈవో ప్రభుదాస్​, ఎస్​వో స్వర్ణలత, పీఈటీ భాగ్యమ్మ, కరాటే  మాస్టర్​శ్రీకాంత్​ తదితరులు పాల్గొన్నారు. 

చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి

మెదక్​ (శివ్వంపేట), వెలుగు: మండలంలోని పాంబండ గ్రామంలో చేపల వేటకు వెళ్లి ఓ యువకుడు కుంటలో మునిగి చనిపోయాడు. ఎస్సై రవికాంతరావు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొమురయ్య, గోనయ్య, సాయిలు అనే ముగ్గురు  బుధవారం గ్రామ శివారులోని వీరారెడ్డి కుంటలో చేపలు పట్టేందుకు వెళ్లారు. రాత్రి గోనయ్య, సాయిలు ఇంటికి రాగా,  కొమురయ్య(28) రాలేదు. దీంతో అతడి భార్య పద్మ తన భర్త ఎక్కడికి వెళ్లాడని గోనయ్య, సాయిలును అడగడంతో చేపలు పడుతుండగా కుంటలో మునిగిపోయాడని చెప్పారు. ఈ మేరకు గురువారం ఉదయం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి కుంటలో గాలించగా ఆచూకీ తెలియలేదు. శుక్రవారం మళ్లీ గాలించగా డెడ్​బాడీ బయటపడింది. మృతుడి భార్య పద్మ తన భర్త మృతిపై అనుమానముందని గోనయ్య, సాయిలుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.  కాగా కొమురయ్య డెడ్​బాడీ నీటిలో ఉన్నా ఉబ్బలేదని పోలీసులు దర్యాప్తు చేయాలని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబాన్ని నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్, ఎంపీపీ హరికృష్ణ, జడ్పీటీసీ మహేశ్​గుప్తా పరామర్శించి  హామీ ఇచ్చారు.

డబుల్ ​ఇంజిన్​ సర్కార్​తోనే అభివృద్ధి

జోగిపేట, వెలుగు : వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ నేత, మాజీ మంత్రి బాబుమోహన్​అన్నారు. డబుల్​ఇంజిన్​సర్కార్​తోనే  ‘ప్రజాగోస-– బీజేపీ భరోసా’ యాత్రలో భాగంగా శుక్రవారం అందోల్ మండలంలోని పలు గ్రామాల్లో బాబూమోహన్ ఆధ్వర్యంలో బైక్​ర్యాలీ నిర్వహించారు. జోగిపేట పట్టణం నుంచి మొదలైన బైక్ ర్యాలీ అన్నాసాగర్, దానంపల్లి, రాంసాన్ పల్లి, ఎర్రారం, నేరడిగుంట గ్రామాల మీదుగా కన్సాన్ పల్లి వరకు సాగింది. ఈ సందర్భంగా బాబూమోహన్ తో ఆయా గ్రామాల ప్రజలు సమస్యలు ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా  బాబూమోహన్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించని ఈ అసమర్థ టీఆర్ఎస్​ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపునిచ్చారు. అనంతరం వడ్ల కల్లాల్లో పనిచేస్తున్న రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎరువులపై అందిస్తున్న సబ్సిడీల గురించి వివరిస్తూ  పాంప్లెంట్లు పంచిపెట్టారు. అనంతరం కన్సాన్ పల్లిలో బీజేపీ గ్రామ అధ్యక్షుడు రమేశ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బాబూమోహన్  బీజేపీ జెండా ఆవిష్కరించారు. ర్యాలీలో వివిధ మండలాల అధ్యక్షులు  పాల్గొన్నారు. 


సింగరేణి  ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర

కోహెడ, వెలుగు: సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర పన్నుతోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం కోహెడ మండల కేంద్రంలో జరిగిన పార్టీ జనరల్​బాడీ మీటింగ్​ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ పచ్చి అబద్దాల కోరు అని మండిపడ్డారు. రామగుండంలో ఎఫ్​సీఐ  ఓపెనింగ్​కు వచ్చినప్పుడు సింగరేణిని ఎలా ప్రైవేటీకరణ చేస్తామని ప్రశ్నించిన మోడీ, ఇప్పుడు పార్లమెంట్​లో  కేంద్ర మంత్రి 4  బొగ్గు గనులను వేలం వేస్తున్నామని ప్రకటించడం సిగ్గు చేటన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఏవిధంగా కుట్ర చేసి అమ్మేశారో అలాగే సింగరేణిపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే సింగరేణి బొగ్గు గనుల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్​చేశారు. రాష్ర్టంలో అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారని, ఈ నెల 23న ప్రజా సమస్యలపై ఆందోళనలు చేస్తున్నట్లు చెప్పారు.జిల్లా కార్యదర్శి మంద పవన్, లీడర్లు వేల్పుల బాలమల్లు, కనుకుంట్ల శంకర్, ముంజ గోపి, సహాయ కార్యదర్శి బోనగిరి శంకర్​తదితరులు పాల్గొన్నారు. 

కన్నులపండువగా దత్తాత్రేయుడి పల్లకీ సేవ

జహీరాబాద్, వెలుగు: దత్త జయంతి ముగింపు సందర్భంగా  ఝరాసంగం  మండలం బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమంలో శుక్రవారం దత్తాత్రేయ స్వామి పల్లకి సేవ  భక్తుల వైభవంగా నిర్వహించారు. బర్దిపూర్ వీధుల్లో భజన, కీర్తనలతో పల్లకిని ఊరేగించారు. మహిళా భక్తులు నిండు కలశాలతో పల్లకికి స్వాగతం పలికారు. కర్ణాటక చాంగులేర్ కు చెందిన కళాకారులు చేసిన దండకాలు, ఖడ్గాలు, భజన కీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి. గురువారం రాత్రి ఆశ్రమ ఆవరణలో నిర్వహించిన లక్ష దీపోత్సవం కన్నుల పండుగ కొనసాగింది.  సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, కాంగ్రెస్​నేత గాలి అనిల్ కుమార్, జహీరాబాద్ బీజేపీ ఇన్​చార్జి జంగం గోపి, టీఆర్ఎస్​లీడర్​మఠం భిక్షపతి స్వామి  తదితరులు పాల్గొన్నారు. 

రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయాలి

సిద్దిపేట రూరల్, వెలుగు: రైతుల సంక్షేమంపై ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే  ఏకకాలంలో రుణ మాఫీ చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్తినేని రాజు డిమాండ్​చేశారు. శుక్రవారం  బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రభుత్వం రైతు ప్రయోజక కార్యక్రమాలు చేపట్టాలని కోరుతూ  తహసీల్దార్​శ్రీనివాస్ కు యువ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి లింగాల జనార్దన్​రెడ్డితో కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్ రైతులకు రుణమాఫీ చేయకపోవడం వల్ల వారు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రుణమాఫీతో పాటుగా ఫసల్ బీమా అమలు చేయాలని ఆయన కోరారు. ఓబీసీ మోర్చా మండలాధ్యక్షుడు దుర్గం రాజు, యువ మోర్చా మండల  అధ్యక్షుడు  సురేశ్​గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 

కొమురవెల్లి  మల్లన్న  దర్శనాలు నిలిపివేత

కొమురవెల్లి, వెలుగు: ఈ నెల 12 నుంచి18వ తేదీ వరకు కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 18న స్వామి వారి కల్యాణం నిర్వహించనుండడంతో మూల విరాట్టుతో పాటు అమ్మవార్ల విగ్రహాలకు అలంకరణ కోసం ఆలయాన్ని మూసివేస్తున్నామన్నారు.  భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.