![బ్రిజ్ భూషణ్ను తొలగించాల్సిందే : రెజ్లర్లు](https://static.v6velugu.com/uploads/2023/01/Wrestlers_bxJRIa7SVf.jpg)
న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా రెండో రోజు కూడా రెజ్లర్లు నిరసన దీక్ష కొనసాగించారు. ప్రెసిడెంట్ను వెంటనే తొలగించి, అన్ని రాష్ట్ర సంఘాలతో పాటు నేషనల్ ఫెడరేషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బజ్రంగ్ పూనియా, వినేశ్ ఫోగట్, అన్షు, సాక్షి మాలిక్, ఆమె భర్త సత్యవ్రత్ కడియాన్తో సహా మరికొంత మంది రెజ్లర్లు.. గురువారం స్పోర్ట్స్ సెక్రటరీ సుజాత చతుర్వేది, సాయ్ డైరెక్టర్ జనరల్ సందీప్ ప్రధాన్, జాయింట్ సెక్రటరీ కునాల్తో గంట పాటు చర్చలు జరిపారు. ప్రెసిడెంట్ నుంచి తమకు ఎదురైన అనుభవాలను, రెజ్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల ముందు ఉంచారు. వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, ప్రెసిడెంట్ను వెంటనే తొలగించాలని రెజ్లర్ల బృందం డిమాండ్ చేసింది. అయితే అధికారుల నుంచి అనుకున్న స్థాయిలో స్పందన లేకపోవడంతో నిరసనను మరింత ఉధృతం చేయాలని రెజ్లర్లు డిసైడ్ అయ్యారు. అంతకుముందు బీజేపీ నాయకురాలు, రెజ్లర్ బబితా ఫోగట్.. గవర్నమెంట్తో చర్చించి అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చినా రెజ్లర్లు వెనక్కి తగ్గలేదు. ‘దురదృష్టవశాత్తు మాకు గవర్నమెంట్ నుంచి సంతృప్తికరమైన స్పందన రాలేదు. మొన్న మా వద్ద 12 మంది బాధితులే ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది. బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకోకుంటే మేం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం. అతన్ని జైల్కు పంపే వరకు విడిచిపెట్టబోం. మేం వరల్డ్ చాంపియన్లం, ఒలింపిక్ విజేతలం. మేం చెప్పే మాటలను విశ్వసించాలి’ అని వినేశ్ వ్యాఖ్యానించింది. మరోవైపు ఈ మొత్తం ఎపిసోడ్పై చర్చించేందుకు అయోధ్యలో అత్యవసర జనరల్ కౌన్సిల్ మీటింగ్కు డబ్ల్యూఎఫ్ఐ రెడీ అవుతోంది.
బృందా కారత్ స్టేజ్ దిగిపో..
జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న రెజ్లర్లకు మద్దతు తెలిపేందుకు వచ్చిన వామపక్ష నేత బృందా కారత్కు చేదు అనుభవం ఎదురైంది. ‘ప్లీజ్ మేడమ్.. ఈ వేదిక నుంచి దిగిపోండి. ఇది అథ్లెట్లు చేస్తున్న పోరాటం. దీనిని రాజకీయం చేయకండి’ అంటూ బజ్రంగ్ చేతులు జోడించి కారత్కు విజ్ఞప్తి చేశాడు. వెంటనే వేదిక దిగిన ఆమె.. మహిళలపై జరిగే లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా తాము కూడా పోరాడుతున్నామని, ఈ వ్యవహారంపై గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరేందుకే ఇక్కడికి వచ్చానని తెలిపారు. కాగా, లైంగిక వేధింపులపై తమకు ఫిర్యాదు ఇవ్వొచ్చని జాతీయ మహిళా కమిషన్ రెజ్లర్లకు సూచించింది.