చైనాలోని తెలుగువారిని వెనక్కి తీసుకురండి

చైనాలోని తెలుగువారిని వెనక్కి తీసుకురండి
  • విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కు చంద్రబాబు లేఖ

అమరావతి: చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అక్కడున్న తెలుగువారి పరిస్థితిపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ పుట్టిన వుహాన్ సిటీలో 58 మంది తెలుగు ఇంజనీర్లు చిక్కుకుని ఉన్నారని, వారిని వెనక్కి తీసుకురావాలని కోరుతూ ఆయన.. విదేశాంగ మంత్రి జయశంకర్‌కు లేఖ రాశారు. ఏపీలోని శ్రీసిటీ సెజ్‌, టీసీఎల్‌ కంపెనీలకు చెందిన ట్రైనీ ఉద్యోగులు 58 మంది చైనాలో ఉన్నారని చంద్రబాబు తన లేఖలో తెలిపారు. చైనాలో కరోనా వ్యాప్తితో ఆ ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారన్నారు. వారిని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావాలని కోరారు.

చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ వేగం వ్యాపిస్తోంది. మామూలు జలుబు, దగ్గుతోనే మొదలవుతున్న ఈ వైరస్ బారినపడి ఇప్పటికే అక్కడ 170 మంది ప్రాణాలు కోల్పోయారు. విదేశాలకు సైతం ఈ వైరస్ వ్యాపిస్తోంది. అమెరికా, సింగపూర్, థాయ్ లాండ్, దక్షిణ కొరియా, నేపాల్, హాంకాంగ్ సహా పలు దేశాలల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇండియాలో ఈ వైరస్ వ్యాపించకుండా కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. చైనా సహా పలు విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులను విమానాశ్రయాల్లోనే స్క్రీనింగ్ చేస్తున్నారు. ఏ మాత్రం వైరస్ లక్షణాలు ఉన్నా ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స చేస్తున్నారు. బ్లడ్ శాంపిల్స్ పుణేలోని జాతీయ వైరాలజీ ల్యాబ్ కు పంపి కరోనా లేదని నిర్ధారించుకున్నాకే వారిని ఇంటికి పంపుతున్నారు. ఈ క్రమంలో కేరళలో ఇవాళ తొలి కరోనా కేసు నమోదైనట్లు తేలింది. అతడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు.