- ఒక్కొక్కరు పార్టీని వీడుతుండడంతో ఫామ్హౌస్కు పిలిపించుకొని చర్చలు
- మంచి రోజులొస్తాయని సముదాయింపు
- 8 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలతో 4 గంటలకుపైగా మీటింగ్
సిద్దిపేట, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి క్యూ కడుతుండడంతో ఆ పార్టీ చీఫ్కేసీఆర్ దిద్దుబాటు చర్యలకు దిగారు. ఉమ్మడి జిల్లాలవారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎర్రవల్లి లోని తన ఫామ్ హౌజ్ కు పిలిపించుకొని బుజ్జగిస్తున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు గ్రేటర్ హైదరాబాద్లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో దాదాపు 4 గంటల పాటు భేటీ అయ్యారు. వీరిలో మాజీ మంత్రులు టీ హరీశ్ రావు , వేముల ప్రశాంత్ రెడ్డి తోపాటు ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, టీ ప్రకాశ్ గౌడ్ , ఎమ్మెల్సీలు శేరి సుభాశ్రెడ్డి , దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, పార్టీ నాయకులు క్యామ మల్లేశ్, రావుల శ్రీధర్ రెడ్డి ఉన్నారు. కాగా, దానం నాగేందర్పార్టీ మారినప్పుడు తాము సీరియస్గా తీసుకోలేదని, కానీ సీనియర్నేతలు కడియం, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారడాన్ని తట్టుకోలేకపోతున్నామని పలువురు ఎమ్మెల్యేలు కేసీఆర్తో వాపోయినట్టు తెలిసింది.
పోచారం శ్రీనివాస్రెడ్డి పార్టీ వీడడాన్ని అంతగా పట్టించుకోవాల్సిన పనిలేదని, నాడు వైఎస్హయాంలో ఇలాంటి పరిణామాలు జరిగినా కుంగిపోలేదని కేసీఆర్చెప్పినట్టు తెలిసింది. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని, భవిష్యత్తులో మనకు మళ్లీ అధికారం ఖాయమని ధీమా వ్యక్తంచేసినట్టు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్నుంచే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారనే ప్రచారం జరుగుతోందని, ఏ కష్టమొచ్చినా తాను అండగా ఉంటానని, ఎవరూ పార్టీని వీడొద్దని అన్నట్టు తెలిసింది. రేపటి నుంచి ఉమ్మడి జిల్లాలవారీగా అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీలు జరుపుతానని కేసీఆర్ పేర్కొన్నట్టు సమాచారం. కాగా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లిపోయినా మాజీ మంత్రి హరీశ్ రావు..రాత్రి వరకు ఫామ్ హౌజ్ లోనే కేసీఆర్ తో ఉన్నారు. ఈ సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మాత్రమే పిలిచినట్టు తెలిసింది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లోకల్గానే ఉన్నా సమావేశానికి హాజరుకాలేదు.