వరంగల్ లో అక్టోబర్ 16న బీఆర్ఎస్ మ్యానిఫెస్టో : కేసీఆర్

వరంగల్ లో  అక్టోబర్ 16న బీఆర్ఎస్ మ్యానిఫెస్టో : కేసీఆర్

తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.  శాసనసభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ భవన్ లో  కేసీఆర్ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.  ఈ సమావేశంలో అక్టోబర్  16 న వరంగల్ లో బీఆర్ఎస్  ఎన్నికల మ్యానిఫెస్టో  విడుదల చేస్తామని కేసీఆర్ తెలిపారు.   ఆ రోజు (అక్టోబర్  16 )  వరంగల్ లో భారీ ర్యాలీ ఉంటుందని కేసీఆర్ తెలిపారు.  ఈ రోజు ( ఆగస్టు 21)న తెలంగాణ భవన్ లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేశారు.   తమ పార్టీ అజెండా ప్రగతి అని తెలిపారు. ఈ సారి మ్యానిఫెస్టోలో చాలా సంక్షేమ పథకాలు ఉంటాయన్నారు. 

అక్టోబర్ 16వ తేదీన 10 లక్షల మందితో వరంగల్ జిల్లా భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సభ ఏర్పాట్లపై ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నేతలకు సీఎం కేసీఆర్ సమాచారం ఇచ్చారు.   రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే ముందే ఇప్పటికే బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహాలు మొదలు పెట్టింది.  ఈ ప్రచార కార్యక్రమాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తూ... అక్టోబర్ 16వ తేదీన భారీ బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభిస్తామన్నారు. మలిదశ ఉద్యమం ప్రారంభం నుంచి కేసీఆర్ కు వరంగల్ బాగా అచ్చొచ్చింది. అందుకే ఇక్కడి నుంచే వచ్చే ఎన్నికల కోసం ప్రచార శంఖారావం పూరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

 జన సమీకరణ బహిరంగ సభ నిర్వహణ, ఏర్పాట్లు.. ఇలా అన్నింట్లోనూ వరంగల్ కు ప్రత్యేకత ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 150 ఎకరాల్లో బహిరంగ సభ, 200 ఎకరాల్లో పార్కింగ్ ఉండేలా వరంగల్ నగర శివారులోని దేవన్నపేట ప్రాంతాన్ని  గుర్తించారు. ఈ మేరకే సభ ఏర్పాట్లు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ తొలి వారంలో వస్తుందని అంచనా వేస్తున్నారు. 

 ఇప్పటి వరకు వరంగల్ లో బీఆర్ఎస్ నిర్వహించిన సభలు

 

  • 2001 జూన్ 21వ తేదీ కాకతీయ డిగ్రీ కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.
  •  2003 ఏప్రిల్ 26వ తేదీన సిద్దిపేట నుంచి వరంగల్ వరకు 100 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ తీశారు. 
  • 2003 ఏప్రిల్ 27వ తేదీన వరంగల్ జైత్రయాత్ర పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు
  • 2005 జులై 17వ తేదీన వరంగల్ లో భారీ బహిరంగ సభ జరిగింది.. 
  • 2007 ఏప్రిల్ 27వ తేదీన తెలంగాణ విశ్వరూప మహాసభ పేరుతో టీఆర్ఎస్‌లో ఆరో వార్షికోత్సవం నిర్వహించారు.
  •  2009 నవంబర్ 23వ తేదీన కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల జేఏసీ బహిరంగ సభ
  • 2010 డిసెంబర్ 16వ తేదీన తెలంగాణ మహా గర్జన  బహిరంగ సభ
  •  2017 ఏప్రిల్ 27వ తేదీన నగరంలోని ప్రకాశ్ రెడ్డి పేటలో పది లక్షల మందితో ప్రగతి నివేదన సభ