ట్యాపింగ్ చేయించినోళ్లు జైలుకెళ్లాల్సిందే : మహేశ్ గౌడ్

ట్యాపింగ్ చేయించినోళ్లు జైలుకెళ్లాల్సిందే : మహేశ్ గౌడ్
  • కేసీఆర్, కేటీఆర్ రోల్ లేకుండా ఇది జరగలే: మహేశ్ గౌడ్
  • బనకచర్లపై వెనక్కి తగ్గేదే లేదని పీసీసీ చీఫ్ క్లారిటీ

నిజామాబాద్, వెలుగు: చరిత్రలో ఎక్కడా ఎప్పుడూలేని రీతిలో గత బీఆర్ఎస్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్​తో దేశంలోనే అతి పెద్ద నేరానికి పాల్పడిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్​గౌడ్ ఆరోపించారు. ఆదివారం పలు ప్రొగ్రామ్స్‌‌లో పాల్గొనడానికి నిజామాబాద్ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. మొత్తం 650 మంది ఫోన్​లు ట్యాప్ చేశారని.. ఇందులో తనతోసహా చాలా మంది లీడర్లు, పారిశ్రామికవేత్తలు, జడ్జిలు ఉన్నరని పేర్కొన్నారు. సినీతారల ఫోన్​లను ట్యాప్​ చేసి వారిని ఇబ్బంది పెట్టారని తెలిపారు. 

ఇంతటి నీచానికి, దుర్మార్గానికి ఒడిగట్టి వ్యక్తిగత స్వేచ్ఛను హరించినవారి పేర్లన్నీ సిట్ బహిర్గతం చేసి విచారణకు పిలిపించాలన్నారు. సిట్ ఆధ్వర్యంలో విచారణ పూర్తి చేసి ఫోన్ ట్యాపింగ్ నేరానికి పాల్పడిన ప్రతీ లీడర్​ను జైలుకు పంపాల్సిందేనని ప్రభుత్వాన్ని కోరారు. కేసీఆర్, కేటీఆర్ రోల్ లేకుండా ట్యాపింగ్ జరిగే అవకాశం లేదని పేర్కొన్నారు. ఐజీ స్థాయి ఆఫీసర్​ను కూర్చోబెట్టాల్సిన పోస్టును రిటైర్డ్ అధికారి ప్రభాకర్​రావుకు కట్టబెట్టి నాటి చీఫ్ సెక్రటరీ, డీజీపీ, లీగల్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలను తమ అవసరాలకు వాడుకున్న నీచమైన పాలన బీఆర్ఎస్‌‌ది అని ధ్వజమెత్తారు. ట్యాపింగ్ బాధ్యులెవరినీ వదలే ప్రసక్తేలేదన్నారు.

వైఎస్ జగన్​తో చెట్టాపట్టాల్

నాటి ఏపీ సీఎం జగన్​తో బీఆర్ఎస్ గవర్నమెంట్ చెట్టాపట్టాలేసుకొని తిరిగి, రాష్ట్ర నీటివాటా గురించి పట్టించుకోని హరీశ్ రావు.. తాను నీతిమంతుడినని ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నారని మహేశ్ గౌడ్ మండిపడ్డారు. 968 టీఎంసీల నీటి వాటా గురించి ఏనాడూ మాట్లాడకుండా రాష్ట్ర రైతుల హక్కులు కాలరాశారని విమర్శించారు. ‘‘బనకచర్ల విషయంలో సీఎం రేవంత్​రెడ్డి, పీసీసీ పూర్తి క్లారిటీతో ఉంది. ప్రాజెక్టుల పేరుతో మన నీళ్లు తరలించుకుపోతామంటే మేమెందుకు ఒప్పుకుంటం. తెలంగాణ నీటి వాటా గురించి ఎక్కడా రాజీపడం. 

ఇందులో మరో మాటేలేదు”అని అన్నారు. రూ.లక్షా 20 వేల కోట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్​కుటుంబం, బడా కాంట్రాక్టర్ల జేబులు నిండాయే తప్ప.. కనీసం వందల లీటర్ల నీరు కూడా అదనంగా రాలేదన్నారు. నాసిరకం పనుల కారణంగా ప్రాజెక్టులకు కూడా బీటలుపడ్డాయని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు నీటితోనే వ్యవసాయానికి సాగునీరు అందుతోందన్నారు.