కామారెడ్డిపైనే బీఆర్ఎస్ ఫోకస్ .. మూడు రోజుల పాటు పర్యటించనున్న పార్టీ ముఖ్యనేతలు

కామారెడ్డిపైనే బీఆర్ఎస్ ఫోకస్ ..  మూడు రోజుల పాటు పర్యటించనున్న పార్టీ ముఖ్యనేతలు
  • నేడు బాన్సువాడ, జుక్కల్​నియోజకవర్గాలకు సీఎం కేసీఆర్​ 
  • రేపు, ఎల్లుండి కామారెడ్డిలో  కేటీఆర్​ మకాం

కామారెడ్డి, వెలుగు: : సీఎం కేసీఆర్​ పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంపై బీఆర్ఎస్ హైకమాండ్​​స్పెషల్ ఫోకస్​ పెట్టింది. జిల్లాలోని అన్ని స్థానాలను తమ ఖాతాలో వేసుకోవడంతో పాటు, కామారెడ్డిలో కేసీఆర్​ను ​భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు.  ఇందులో భాగంగా సోమవారం జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ సెగ్మెంట్లలో నిర్వహించే సభల్లో సీఎం కేసీఆర్ ​పాల్గొననున్నారు. అనంతరం రెండు రోజుల పాటు ఆ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్ ​కేటీఆర్​కామారెడ్డి నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

బీఆర్ఎస్​ తమ అభ్యర్థులను ప్రకటించి రెండు నెలలు దాటింది. షెడ్యూల్​కు ముందే ఆ పార్టీ ఎమ్మెల్యేలు గ్రామాలు, టౌన్​లలో విస్తృతంగా పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. షెడ్యూల్ ​వెలవడిన అనంతరం క్షేత్రస్థాయిలో ప్రచారం షూరూ చేశారు. బూత్​లు, గ్రామాలు, ఓటర్ల వారీగా ఇన్​చార్జులను నియమించారు. వీరు రోజూ ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. పోలింగ్​కు మరో నెల రోజుల గడువు ఉండడంతో పార్టీ మరింత దూకుడు పెంచుతోంది.

సోమవారం జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో కేసీఆర్​పర్యటిస్తున్నారు. ఆయా చోట్ల ఏర్పాటు చేసే ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొననున్నారు. స్పీకర్​పోచారం శ్రీనివాస్​రెడ్డి, ఎమ్మెల్యే హన్మంత్​షిండే భారీ జన సమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధినేత పర్యటనతో మరింత ఊపు వస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత పరిస్థితిని బట్టి కేటీఆర్, హరీశ్​రావు పర్యటించే అవకాశముంటుందని పేర్కొన్నారు. 

కామారెడ్డి నియోజకవర్గంలో..​

సీఎం కేసీఆర్​ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ భారీ మెజార్టీతో విజయం సాధించాలనే టార్గెట్​తో ముందుకెళ్తున్నారు. పార్టీ వర్కింగ్​ప్రెసిడెంట్​ కేటీఆర్ అన్ని తానై వ్యవహరిస్తున్నారు. ఆయన కనుసన్నల్లోనే  గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు. ఇన్​చార్జులుగా మంత్రి కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్​రెడ్డి ఉన్నారు. నియోజకవర్గస్థాయిలో కో ఆర్డినేషన్​కమిటీ వేశారు. ఇందులో ఎమ్మెల్యేతో పాటు, పార్టీ జిల్లా ప్రెసిడెంట్​ ఎంకే ముజీబోద్దిన్, నేతలు కొమ్ముల తిర్మల్​రెడ్డి, పున్న రాజేశ్వర్,​ నర్సింగ్​రావు ఉన్నారు.

మండలాల వారిగా కూడా కమిటీలు వేశారు. ఈ నెల 7న నియోజకవర్గ స్థాయి కార్యకర్తల మీటింగ్ నిర్వహించగా కేటీఆర్​ హాజరై, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 18న హైదరాబాద్​లో నియోజకవర్గ, మండల స్థాయి ముఖ్య లీడర్లతో రివ్యూ మీటింగ్​ జరిగింది. ఈ మీటింగ్​ల తర్వాత మరింత జోరు పెంచారు. చేరికలను సైతం ప్రోత్సహిస్తున్నారు. మంగళ, బుధవారాల్లో కేటీఆర్ మరోసారి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మొదటి రోజు పాత మాచారెడ్డి మండలం, కామారెడ్డి టౌన్, రూరల్, రెండో రోజు పాత భిక్కనూరు, దోమకొండ మండలాల్లో మీటింగ్ లు ఏర్పాటు చేయనున్నారు. స్థానిక లీడర్లు, కార్యకర్తలతో కేటీఆర్​మాట్లాడనున్నారు.

ALSO READ : నాలుగు దఫాలుగా..వారే ప్రత్యర్థులు

 ప్రచార సరళి, రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తారు. పార్టీ శ్రేణుల మీటింగ్స్​తర్వాత, కులాల వారిగా కూడా మీటింగ్స్​ఏర్పాటు చేయనున్నారు. నవంబర్​9న కేసీఆర్ ​కామారెడ్డిలో నామినేషన్​ వేస్తారు. అదే రోజు నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగసభలో సీఎం పాల్గొంటారు. ఈ సభ తర్వాత స్థానిక ముఖ్యనేతలు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తారు. మధ్య మధ్యలో కేటీఆర్, వీలును బట్టి కేసీఆర్​కూడా రావొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.