కారుకు ముందంతా ..ముళ్లబాటే!..12 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్​ ఓటమి

కారుకు ముందంతా ..ముళ్లబాటే!..12 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్​ ఓటమి
  •     అన్ని చోట్లా కాంగ్రెస్, బీజేపీలకు పెరిగిన ఓట్​ షేర్ ​
  •     త్వరలో జరిగే స్థానిక సంస్థలు, పార్లమెంట్​ ఎన్నికల్లో బీఆర్ఎస్​పై ఎఫెక్ట్

మహబూబ్​నగర్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు నడిచింది. ఫైనల్​గా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 స్థానాలకు గాను 12 స్థానాల్లో కాంగ్రెస్​ పార్టీ హవా కొనసాగింది. అయితే, గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లో కాంగ్రెస్​, బీజేపీలకు ఓటింగ్​ పర్సంటేజీ పెరిగింది. అదే సమయంలో బీఆర్ఎస్​ ఓటింగ్ పర్సంటేజీ అన్ని నియోజకవర్గాల్లోనూ పడిపోయింది.

పుంజుకున్న కాంగ్రెస్..​

గత ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లో ఒక్క అసెంబ్లీ కూడా గెలవలేదు. 2014 ఎన్నికల తర్వాత ఈ పార్టీ ఓటింగ్ పర్సంటేజీ పడిపోయింది. పైగా 2018లో మక్తల్, మహబూబ్​నగర్​ స్థానాలను అలయెన్స్​లో భాగంగా టీడీపీకి ఇచ్చారు. దీంతో ఈ రెండు స్థానాల నుంచి పార్టీ తరఫున అభ్యర్థులు ఎవరూ బరిలో దిగలేదు. అయితే, ఈ ఎన్నికల్లో మాత్రం పార్టీకి అనూహ్యంగా ఓటింగ్​ పర్సంటేజీ పెరిగింది. 2018 ఎన్నికల్లో నారాయణపేట అసెంబ్లీలో కాంగ్రెస్​కు కేవలం 3.92 శాతం ఓట్లు పోల్​ కాగా, ఈసారి రికార్డు స్థాయిలో 46.31శాతం ఓట్లు పోల్​ అయ్యాయి.

మహబూబ్​నగర్​లో ఈ ఎన్నికల్లో 48.08 శాతం, జడ్చర్లలో గత  ఎన్నికల్లో 30.85 శాతం ఉండగా.. ఈసారి 50.03%, దేవరకద్రలో గతంలో 34.91 శాతం ఉండగా ఈసారి 45.31 శాతం, మక్తల్​లో ఈసారి 39.88 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. దీంతో ఓట్ల పర్సంటేజీ పెరగడంతో పాటు ఈ ఐదు అసెంబ్లీలను కాంగ్రెస్​ ‘హస్త’గతం చేసుకుంది.

బీజేపీకి పెరిగిన ఓటింగ్..​

ఈ ఎన్నికల్లో బీజేపీకి నారాయణపేట నియోజకవర్గం మినహా మిగతా నాలుగు నియోజకవర్గాల్లో ఓటింగ్​ శాతం పెరిగింది. గత ఎన్నికల్లో బీజేపీకి నారాయణపేట అసెంబ్లీలో 12.43 శాతం ఓట్లు పోల్​ అవగా, ఈ సారి 8.24 శాతానికి పడిపోయింది. మహబూబ్​నగర్​ అసెంబ్లీలో బీజేపీకి ఏడు శాతం ఓటింగ్​ పెరిగింది. నిరుడు ఎన్నికల్లో 3,72 శాతం ఉండగా, ఈసారి 10.97 శాతం ఓట్లు పోల్​ అయ్యాయి. జడ్చర్లలో గతంలో 2.24 శాతం ఓట్లు పోల్​ అవగా, ఈసారి 4.05 శాతానికి పెరిగింది.

దేవకరద్రలో నిరుడు 2.97 శాతం ఓట్లు పోల్​ అవగా.. ఈసారి 6.74 శాతం ఓట్లు పోల్​ అయ్యాయి. మక్తల్​లో నిరుడు 12.24 శాతం ఓట్లు పోల్​ అవగా, ఈసారి రికార్డు స్థాయిలో 24.01 శాతం ఓట్లు పోల్​ అయ్యాయి. ఈ లెక్కల ప్రకారం రానున్న పార్లమెంట్​ ఎన్నికల్లో ఈ పార్టీ బలమైన ప్రత్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలున్నాయి. 

బీఆర్ఎస్​కు పడిపోయిన ఓటింగ్​ పర్సెంటేజ్..​

నారాయణపేట అసెంబ్లీ మినహా మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్​ పార్టీకి ఓట్ల పర్సంటేజీ గణనీయంగా పడిపోయింది. గత ఎన్నికల్లో నారాయణపేట అసెంబ్లీలో బీఆర్​ఎస్​కు 42.25 శాతం ఓట్లు పోల్​ అవగా, ఈ ఎన్నికల్లో 1.98 శాతం ఓట్లు తగ్గి 40.97 శాతం ఓట్లు పోల్​ అయ్యాయి. మహబూబ్​నగర్​లో గత ఎన్నికల్లో 54.16 శాతం ఓట్లు పోల్​ అవగా ఈసారి 37.72 శాతం  ఓట్లు పోల్​ అయ్యాయి.

జడ్చర్లలో గతంలో 58.95 శాతం ఓట్లు పోల్​ అవగా ఈసారి 41.9 శాతానికి పడిపోయింది. దేవరకద్రలో గతంలో 55.12 శాతం రాగా, ఈసారి 44.6 శాతం, మక్తల్​లో గతంలో 47.77 శాతానికి గాను ఈసారి 30.55 శాతం ఓట్లు మత్రమే పోల్​ అయ్యాయి. ఈ లెక్కల ప్రకారం మహబూబ్​నగర్​లో 16.44 శాతం, జడ్చర్లలో 17.05 శాతం, దేవరకద్రలో 10.52 శాతం, అత్యధికంగా మక్తల్​లో 17.22 శాతం ఓట్లు తగ్గిపోయాయి.

వచ్చే ఎన్నికల్లో ప్రభావం..

కాంగ్రెస్​, బీజేపీలకు ఓటింగ్​ పర్సంటేజీ పెరగడంతో వచ్చే ఏడాది జరిగే గ్రామ పంచాయతీ, మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, పార్లమెంట్  ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ప్రభావం చూపే అవకాశం ఉంది. బీఆర్ఎస్​కు ఓటింగ్​ శాతం పడిపోవడం, ఇప్పటికే ఈ పార్టీలోని సర్పంచులు, ఎంపీటీసీలు ఫండ్స్​ లేక నిరుత్సాహంలో ఉండడంతో రానున్న ఎన్నికల్లో ఈ రెండు జాతీయ పార్టీల హవా కొనసాగే అవకాశాలున్నాయనే టాక్​ వినిపిస్తోంది.

బీఆర్ఎస్​కు ఓటింగ్​ శాతం తగ్గడానికి ప్రధానంగా మున్సిపాల్టీలు, మండలాల్లో జరిగిన భూ దందాలు, ప్లాట్ల కబ్జాలు వంటి ఆరోపణలే కావడంతో రానున్న ఎన్నికల్లోనూ ఓటర్ల నుంచి ఇదే తరహా తీర్చు ఉంటుందనే చర్చ నడుస్తోంది.