పరిగి ఎమ్మెల్యే మళ్లీ గెలిస్తే.. మహిళలకు రక్షణ లేకుండా పోతుంది

పరిగి ఎమ్మెల్యే మళ్లీ గెలిస్తే.. మహిళలకు రక్షణ లేకుండా పోతుంది
  • బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేత విమర్శలు

వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే మహేష్​రెడ్డిపై సొంత పార్టీ నుంచే విమర్శలు రావడం సంచలనం సృష్టిస్తోంది. వచ్చే ఎన్నికల్లో మహేష్​ మళ్లీ ఎమ్మెల్యే గా గెలుపొందితే నియోజకవర్గంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని పూడూరు మండల బీఆర్​ఎస్ మహిళా అధ్యక్షురాలు బాలమణి విమర్శించారు. ఈ కామెంట్స్​ జిల్లా రాజకీయాల్లో కలకలం సృష్టించాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి మన్నేగూడలో ఎమ్మెల్యే చేపట్టిన పల్లెబాట రసాబాసగా మారింది. ఎమ్మెల్యే తమ గ్రామాలకు రావద్దంటూ కొందరు గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

ఈ క్రమంలో బీఆర్​ఎస్​నాయకులకు గ్రామస్థులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మహిళా నేత బాలమణిపై సైతం సొంత పార్టీనేతలే బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన సమస్యలు చెబుతామని వెళ్లగా ఓ బీఆర్​ఎస్​నేత తనపై చెయ్యి చేసుకోబోయాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 'మహిళలు ఎమ్మెల్యేకు సమస్యలు చెప్పవద్దా.. ఇలాంటి ఎమ్మెల్యే ఉంటే ఎంత లేకుంటే ఎంత?' అంటూ ఆగ్రహించారు. రసాబాస నడుమే పల్లెబాట కార్యక్రమం జరిగింది.