కాంగ్రెస్​ మీటింగ్​లో బీఆర్ఎస్​ ఎమ్మెల్యే

కాంగ్రెస్​ మీటింగ్​లో బీఆర్ఎస్​ ఎమ్మెల్యే
  • మహబూబాబాద్​ ముఖ్యనేతల భేటీలో పాల్గొన్న తెల్లం వెంకట్రావ్​
  • బీఆర్​ఎస్​ సమావేశాలకు దూరం దూరం

భద్రాద్రి కొత్తగూడెం/ మహబూబాబాద్, వెలుగు: భద్రాచలం బీఆర్ఎస్​ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ మరోసారి కాంగ్రెస్​ పార్టీ మీటింగ్​కు హాజరై బీఆర్​ఎస్​కు షాక్​ ఇచ్చారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు ఆధ్వర్యంలో మంగళవారం మహబూబాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గ కాంగ్రెస్​ ముఖ్య నేతల సమావేశం జరిగింది. మహబూబాబాద్​లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్​ అధ్యక్షుడు పొదెం వీరయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పాటు మహబూబాబాద్​ పార్లమెంట్ సెగ్మెంట్​ పరిధిలోని ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. వీళ్లతోపాటు బీఆర్ఎస్​ ఎమ్మెల్యే తెల్లం కూడా సమావేశంలో ప్రత్యక్షమయ్యారు.

బీఆర్ఎస్​ఎమ్మెల్యేగా ఉండి, కాంగ్రెస్ మీటింగ్​లో పాల్గొనడం, గెలుపు వ్యూహాలపై చర్చించడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వెంటనే తెల్లం వెంకట్రావ్​మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డిని, ఆ తర్వాత  సీఎం రేవంత్​రెడ్డిని కలిశారు. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభా వేదికపైన కూడా ఆయన కూర్చున్నారు. కొన్నిరోజులుగా బీఆర్ఎస్​పార్టీ కార్యక్రమాలకు, పార్లమెంట్​స్థాయి రివ్యూ మీటింగులకు దూరంగా ఉంటున్నారు. దీంతో తెల్లం వెంకట్రావ్​ పార్టీ మారడం ఖాయమనే ప్రచారం సాగుతున్నది.