సీఎం రేవంత్​తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్ భేటీ

సీఎం రేవంత్​తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్ భేటీ
  • నేడు కాంగ్రెస్​లో చేరే చాన్స్
  • కాంగ్రెస్​లో చేరిన కేటీఆర్ బామ్మర్ది రాహుల్ రావు, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్
  • పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన రేవంత్  

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ భేటీ అయ్యారు. శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్​లోని రేవంత్ నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ లో చేరేందుకు ప్రకాశ్ గౌడ్ సిద్ధమయ్యారని, శనివారం రేవంత్ సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. 

సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసి తన చేరికపై ముహూర్తం ఖరారు చేసుకున్న తర్వాతనే రేవంత్ ను మర్యాదపూర్వకంగా ప్రకాశ్ గౌడ్ కలిశారని తెలిసింది. కాగా, ఇంతకుముందు కూడా ఒకసారి రేవంత్​తో ప్రకాశ్ గౌడ్ భేటీ అయ్యారు. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరుతారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. 

త్వరలో మరికొందరి చేరికలు.. 

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మర్ది (శైలిమ సోదరుడు) ఎడ్ల రాహుల్ రావు కాంగ్రెస్​లో చేరారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆధ్వర్యంలో సీఎం సమక్షంలో పార్టీలో చేరారు. అలాగే మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ కూడా రేవంత్ సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. వారికి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సీఎం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కాగా, పార్టీలో చేరికలు మరింత ఊపందుకుంటాయని కాంగ్రెస్ వర్గాలు చెప్తన్నాయి. బీఆర్ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు చెప్పారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇదే బాటలో ఇప్పుడు ప్రకాశ్ గౌడ్ నడవనున్నారు. త్వరలోనే మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్​లో చేరనున్నారని తెలిసింది.