
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మూడో రోజు ఈడీ విచారణ ముగిసింది. మార్చి 21వ తేదీ ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఆఫీసులోకి వెళ్లిన కవిత.. రాత్రి 9 గంటల 30 నిమిషాల సమయంలో బయటకు వచ్చారు. 10 గంటలకు పైగా సుదీర్ఘంగా విచారించారు అధికారులు. కవిత విచారణ ముగిసిందని ఈడీ అధికారులు ప్రకటించారు. దీంతో కవిత ఈడీ కార్యాలయంనుంచి బయటకు వచ్చారు.
ఎమ్మెల్సీ కవితను విచారిస్తున్న సమయంలో బీఆర్ఎస్ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ సోమ భరత్ సాయంత్రం 6 గంటల సమయంలో ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు. ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి మేరకు ఈడీ అధికారులు భరత్ను ఆఫీసుకు పిలిచారు. కవితకు సంబంధించిన ఆథరైజేషన్ సంతకాల కోసం పిలిచినట్టు సమాచారం. తదుపరి విచారణలో అవసరమైతే కవితకు బదులుగా సోమ భరత్ని పంపించేందుకు.. కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను సోమా భరత్ అందజేసినట్లు తెలుస్తోంది.
ఈడీ కార్యాలయానికి వెళ్లే ముందు కవిత తన పాత మొబైళ్లను మీడియా ఎదుట ప్రదర్శించారు. కవర్లలో వాటిని తీసుకెళ్తున్నట్లు చూపించారు. 10 మొబైళ్లను కవిత వినియోగించారని ఛార్జ్షీట్లో ఈడీ పేర్కొన్న నేపథ్యంలో....విచారణకు ఆమె తన పాత ఫోన్లను తీసుకెళ్లారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో పేర్లున్న అందరి ఫోన్లు, కాల్ డేటాను ఈడీ సేకరించింది. తాజాగా కవిత వాడిన ఫోన్లను తీసుకుంది. సెప్టెంబర్ 2021 నుంచి ఆగస్టు 2022 వరకు కవిత 10 ఫోన్లు వాడినట్లు..వాటిని ధ్వంసం చేసినట్లు ఈడీ కవితపై అభియోగాలు చేసింది. ఈ కేసులో మొత్తం 36 మంది 170 ఫోన్లు మార్చారని ఈడీ అభియోగాలున్నాయి. స్పెషల్ కోర్టుకు దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ కంప్లైంట్లో కవిత 10 ఫోన్లు వాడినట్లు ఈడీ వెల్లడించింది. అందుకే ఈడీ అభియోగం మేరకు కవిత 10 ఫోన్లను అధికారులుకు అందజేశారు.
సెల్ ఫోన్లపైనే విచారణ..
కవిత నుంచి 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాక వాటిపైనే అధికారులు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. కవిత అవే ఫోన్లు తీసుకొచ్చారా..లేదా అనేదానిపై విచారణ జరిగినట్లు సమాచారం. అయితే కవిత తీసుకెళ్లిన కొన్ని ఫోన్ల IMEI నంబర్లు....ఈడీ అధికారుల దగ్గరున్న డేటాకు మ్యాచ్ కాలేదని తెలుస్తోంది.
ఎమ్మెల్సీ కవితను రెండోరోజు ఈడీ అధికారులు 20 ప్రశ్నలు అడగ్గా....మూడో రోజు 15 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈడీ విచారణ సుధీర్ఘంగా కొనసాగడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ పెరిగిపోయింది. కవితను అరెస్ట్ చేస్తారేమోనని ఆందోళన కనిపించింది. అయితే చివరకు కవిత ఈడీ కార్యాలయం నుంచి చిరునవ్వుతో బయటికి రావడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు సంతోషం వ్యక్తం చేశారు.