
హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోక్సభ పోరును చాలెంజ్గా తీసుకున్న బీఆర్ఎస్.. మిగతా పార్టీల కంటే ముందే రంగంలోకి దిగింది. సోమవారం తెలంగాణ భవన్లో చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహేందర్రెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి తదితరులతో కలిసి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
2019 పార్లమెంట్ఎన్నికలతో పోల్చితే ఈసారి భిన్నమైన పరిస్థితి ఉంటుందని, రాష్ట్రంలో కాంగ్రెస్అధికారంలోకి రావడం, బీజేపీ ప్రాబల్యం కూడా పెరగడంతో ఈసారి ఎక్కువ నియోజకవర్గాల్లో ముక్కోణపు పోటీ ఉంటుందని కేటీఆర్ చెప్పినట్టు తెలిసింది. పార్లమెంట్ ఎన్నికలపై ఇక వరుస సమీక్షలు, సమావేశాలు ఉంటాయని చెప్పారు. జనవరి 3 నుంచి తెలంగాణ భవన్లో రోజుకు ఒక లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల సన్నద్ధతపై చర్చిస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా, లోక్సభ ఎన్నికల్లో అంతకన్నా ఎక్కువగా పని చేసి మంచి ఫలితాలు సాధించడమే టార్గెట్గా పని చేద్దామని చెప్పినట్టు తెలిసింది. పార్టీ ఓడిపోయిన స్థానాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థులే నియోజకవర్గ ఇన్చార్జీలుగా ఉంటారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా ఓటమికి దారితీసిన పరిస్థితులపైనా సమీక్షించారు.
చేవెళ్లలో 98 వేల ఓట్ల లీడ్ ఉన్నది
చేవెళ్ల లోక్సభ స్థానంలో మరోసారి గులాబీ జెండా ఎగరాలని కేటీఆర్ అన్నారు. చేవెళ్ల లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలకు 4 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలిచారని, మొత్తం పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్కు 98 వేల ఓట్ల లీడ్వచ్చిందని గుర్తు చేశారు. గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురైందని, అప్పుడు బీజేపీ అభ్యర్థికి 15 శాతానికిపైగా ఓట్లు వచ్చాయని తెలిపారు. అసెంబ్లీ ఫలితాలతో నిమిత్తం లేకుండా ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు పెరిగే అవకాశముందని అంచనా వేశారు. ఆ పార్టీ ప్రాబల్యం ఎంత పెరిగినా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్దక్కిన 98 వేల ఓట్ల మెజార్టీని నిలబెట్టుకునేలా పని చేయాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు ప్రకాశ్గౌడ్, అరికేపూడి గాంధీ, కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నన్ను మళ్లీ పోటీ చేయమన్నరు: రంజిత్రెడ్డి
చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి తనను మళ్లీ పోటీ చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. పార్టీ ఆదేశాలను పాటిస్తానని ఆయన తెలిపారు. కేటీఆర్తో సమావేశం అనంతరం తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని కేటీఆర్దిశానిర్దేశం చేశారని చెప్పారు. తెలంగాణ అంటేనే బీఆర్ఎస్అని, ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినా, ఎంతో అభివృద్ధి చేసినా కాంగ్రెస్ ఇచ్చిన తప్పుడు హామీలతో ఓడిపోయామన్నారు. బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని కాంగ్రెస్, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. ఆ పార్టీల ఆశలు నెరవేరబోవన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని తెలిపారు.