
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తన సోదరుడు కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. నోటీసులను ఖండిస్తున్నట్టు చెప్పారు. తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే రేవంత్రెడ్డి సర్కారు నోటీసులు ఇచ్చిందని ఆరోపించారు. ఈ మేరకు సోమవారం కవిత ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు.
సీఎం రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతున్నదని అన్నారు. తమ పార్టీ నేతలకు వరుసగా నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తేటతెల్లమైందని పేర్కొన్నారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడిన చరిత్ర కేసీఆర్ సైనికులదని తెలిపారు.