అదానీ..రియల్టీలోనూ రిచెస్ట్ ..ఇండియాలోనే సంపన్న స్థిరాస్తి వ్యాపారి

అదానీ..రియల్టీలోనూ రిచెస్ట్ ..ఇండియాలోనే సంపన్న స్థిరాస్తి వ్యాపారి
  • రియల్టీ ఆస్తి విలువ రూ.90 వేల కోట్లు
  • రెండోస్థానంలో డీఎల్ఎఫ్​  
  • గ్రోహే హురున్​ రిపోర్ట్​ వెల్లడి

న్యూఢిల్లీ: చాలా రంగాలతోపాటు రియల్​ఎస్టేట్​లోనూ గౌతమ్ అదానీ దూసుకెళ్తున్నారు.  ఆయన కుటుంబం దేశంలోనే అత్యంత సంపన్న రియల్టర్​గా అవతరించింది. డీఎల్ఎఫ్ అధినేత రాజీవ్ సింగ్ కుటుంబాన్ని వెనక్కి నెట్టింది.  గ్రోహే హురున్ ఇండియా రియల్ ఎస్టేట్- 150 లిస్ట్ ప్రకారం, అదానీ కుటుంబం రియల్ ఎస్టేట్, ఇన్​ఫ్రా, పట్టణాభివృద్ధి వ్యాపారాల విస్తరణ వల్ల రూ.3.4 లక్షల కోట్ల అంచనా ఆస్తితో టాప్​లో ఉంది. అదానీ కుటుంబం రియల్ ఎస్టేట్ సంపద ఏడాదిలో 73 శాతం పెరిగి రూ.90,400 కోట్లకు చేరింది. 

అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసే అదానీ ప్రాపర్టీస్ దేశంలోనే అత్యంత విలువైన అన్‌‌‌‌లిస్టెడ్ రియల్ ఎస్టేట్ సంస్థగా నిలిచింది. మార్కెట్ కరెక్షన్ కారణంగా 29 శాతం సంపద కోల్పోయిన రాజీవ్ సింగ్ కుటుంబం రూ.90,200 కోట్ల సంపదతో రెండో స్థానానికి పడిపోయింది. ముంబైకి చెందిన లోధా డెవలపర్స్ అధినేత మంగళ్ ప్రభాత్ లోధా కుటుంబం రూ.67,700 కోట్ల సంపదతో మూడో స్థానంలో ఉంది. ఒబెరాయ్ రియల్టీకి చెందిన వికాస్ ఒబెరాయ్ రూ.42,500 కోట్లతో నాలుగో స్థానాన్ని ఈసారి కూడా నిలబెట్టుకున్నారు. 

రహేజా కుటుంబ ఆస్తి విలువ రూ.42 వేల కోట్లు

రహేజా కార్పొరేషన్​ అధినేత చంద్రు రహేజా కుటుంబం రూ.42,200 కోట్లతో ఐదో స్థానంలో నిలిచింది. ఫీనిక్స్ మిల్స్ అధిపతి అతుల్ రుయా కుటుంబం రూ.29,900 కోట్లతో ఆరో స్థానం, బెంగళూరుకు చెందిన రాజా బాగ్‌‌‌‌మనే కుటుంబం రూ.29,100 కోట్లతో ఏడో స్థానంలో నిలిచారు. హీరానందానీ కమ్యూనిటీస్ అధినేత నిరంజన్ హీరా నందానీ రూ.26,900 కోట్లతో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నారు. 

గురుగ్రామ్‌‌‌‌కు చెందిన ఎం3ఎమ్ ఇండియా గ్రూప్​ను నిర్వహించే బసంత్ బన్సల్ కుటుంబం రూ.25,500 కోట్లతో తొమ్మిదో స్థానం, బెంగళూరు సత్వా డెవలపర్స్ విజయ్ కుమార్ అగర్వాల్ కుటుంబం రూ.20,500 కోట్ల సంపదతో  పదో స్థానంలో నిలిచారు. కంపెనీల వాల్యుయేషన్ పరంగా  చూస్తే డీఎల్ఎఫ్ రూ.1.47 లక్షల కోట్లతో అత్యంత పటిష్టంగా ఉంది. లోధా డెవలపర్స్ రూ.93,700 కోట్లతో తర్వాతి స్థానంలో ఉంది. ఓయోకు చెందిన ప్రిజమ్ సంస్థ తన వాల్యుయేషన్‌‌‌‌ను రెట్టింపు చేసుకుని రూ.67,200 కోట్లతో టాప్–5 లోకి వచ్చింది. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ రూ.58,700 కోట్లతో తొమ్మిదో స్థానం, గోద్రెజ్ ప్రాపర్టీస్ రూ.53,100 కోట్లతో పదో స్థానంలో ఉన్నాయని రిపోర్ట్​ తెలిపింది.